logo

క్షణికావేశం.. తీరని విషాదం

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మంగళవారం వేర్వేరుగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు బాధిత తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చాయి.

Published : 08 Feb 2023 05:09 IST

ఒకే రోజు ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మంగళవారం వేర్వేరుగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు బాధిత తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చాయి.


పోలీసు అయిత అంటివి కదా బిడ్డ..!

చెన్నారావుపేట, న్యూస్‌టుడే: ‘అమ్మా నేను పోలీసు ఉద్యోగం సాధించి నాన్నను, నిన్ను ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా’ అని చెప్పిన కుమారుడు మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హృదయాన్ని కలిచివేసే ఈ  ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న దంపతులకు కూతురు, కుమారుడు (14) ఉన్నారు. కుమారుడు స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లితో కుమారుడు ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం తండ్రి.. పాఠశాలకు ఆలస్యం అవుతుందని కుమారుడిని మందలించి పనికి వెళ్లారు. తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు  ఇంట్లో తల్లి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ పేర్కొన్నారు.


కడుపు నొప్పి భరించలేక..

సుబేదారి, న్యూస్‌టుడే: హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబేదారి సీఐ షుకూర్‌ కథనం మేరకు... వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ విద్యార్థి(16) గత ఐదేళ్లుగా పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం స్నానాల గది సమీపంలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన వార్డెన్‌ వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. గతంలో పలుసార్లు కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడని వసతి గృహం వార్డెన్‌ తల్లిదండ్రులకు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ పేర్కొన్నారు.


గుర్తిద్దాం.. బంగారుబాట చూపుదాం..

బాలలు క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. ఈ నేపథఎంలో బాలలు ప్రాణాలు తీసుకోవడానికి కారణాలు, ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మానసిక నిపుణులు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి..

  పెరిగిన కుటుంబ వాతావరణం, బంధువులతో కలయిక, తల్లిదండ్రుల ప్రవర్తన ఇలా రకరకాల ప్రభావాలు పిల్లలపై ఉంటుంది. ఈ వయసులో వారి ఆలోచనలు సున్నితంగా ఉంటాయి. ఏదైనా మాటంటే ఒప్పుకోరు. చిన్న విషయాలను పెద్దగా ఆలోచించి ఏదో అవుతుందని భ్రమ పడుతుంటారు. ఒంటరిగా ఉండేందుకు యత్నిస్తుంటారు. దీనిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తుండాలి.  

   తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకూడదు. వారిని చూసి నేర్చుకో.. వీరిని చూసి నేర్చుకో..అని ఇతరులతో పోల్చకూడదు. వారిలోఉన్న ప్రతిభను గుర్తించి అటువైపు ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వారికి నచ్చని మార్గం వైపు వెళ్లమంటే ఒప్పుకోరు.  

  పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలి. వారితో స్వేచ్ఛగా మాట్లాడాలి.  పిల్లల అవసరాలను సాధ్యమైనంత వరకు తీర్చెందుకు ప్రయత్నించాలి. లేదా వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించాలి. వారి ఆలోచనలకు మద్దతు ఇస్తూనే అందులో లోటుపాట్లను వివరించాలి. ఇలా పిల్లలో మార్పులను తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి.


ఉపాధ్యాయులు గమనించాలి

పిల్లలు ఎక్కువ ఉత్తేజితులుగా ఉంటారు. ఏదైనా విషయం చెబితే వెంటనే స్పందిస్తారు. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది. ఈదశలో ఉన్న వారికి పాఠాలు బోధించే వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సున్నిత మనస్కులను ఒంటరిగా ఉండేవాళ్లను పరిశీస్తుండాలి. వారిని మిగితా స్నేహితులతో కలిసేలా ప్రోత్సహించాలి. వారితో కలిసిపోయి క్రమశిక్షణ నెర్పించాలి. వారు తలుచుకుంటే ఏదైన సాధిస్తారనే భరోసా నింపాలి. పిల్లలు కష్టపడితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని వారికి తెలియజేయాలి.


పిల్లలను చరవాణిలకు దూరంగా ఉంచాలి
-డాక్టర్‌ పీ.వీ కమలకిషోర్‌, మానసిక వైద్య నిపుణులు

నేడు చాలా మంది పిల్లలు చరవాణిలకు అతుక్కొని ఉంటున్నారు. దీని వల్లీ వారి ఆలోచనశక్తి బాగా తగ్గిపోతుంది.  చాలా వరకు పిల్లలను వాటికి దూరంగా ఉంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో చరవాణి ఇస్తే తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉండాలి. పిల్లల హృదయాలు సున్నితంగా ఉంటాయి. చరవాణిలో వచ్చిన కొన్ని సందేశాలు వారిని కలిచివేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది.


పిల్లలు దైర్యంతో ఉండాలి   -టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డి

గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో చిన్నతనంలో చాలా విషయాలను  పెద్దలు పిల్లలకు చెప్పేవారు. నేడు కుటుంబాలు చిన్నవయ్యాయి. చాలా మంది పిల్లలతో సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. ఇలాంటి వారు  మారాలి. పిల్లలతో బంధాలు పెంచుకోవాలి. చెడు మార్గం వైపు వెళ్లకూడదు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలి. సమాజంలో ప్రతి తల్లిదండ్రులు వారి ఎదుగుదలతో పాటు పిల్లలను కూడా ప్రయోజకులను చేయాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని