icon icon icon
icon icon icon

Chandrababu: రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి: చంద్రబాబు

కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే జగన్‌ ఓట్లు అడగాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Published : 09 May 2024 17:44 IST

చీపురుపల్లి: కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే జగన్‌ ఓట్లు అడగాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని విమర్శించారు. మోదీ గురించి బొత్స కాదు.. దమ్ముంటే జగన్‌ మాట్లాడాలన్నారు.  ప్రజల జీవితాలు మార్చేందుకే సూపర్‌ సిక్స్‌ తెచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది నేనే.. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత కూటమిదేనని భరోసా ఇచ్చారు. తోటపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేసి నెలలోగా నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బకాయిలతో కలిపి జులైలో రూ.7వేలు పింఛను ఇస్తామని ప్రకటించారు.

‘‘ఉత్తరాంధ్ర తెదేపాకు కంచుకోట. ఈ ప్రాంతమంటే ప్రత్యేక అభిమానం. బటన్‌ నొక్కి ప్రజలకు ఇచ్చింది ఎంత.. జగన్‌ తిన్నదెంత? ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే.. ఎప్పుడూ నిజం మాట్లాడరు. వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెదేపా. నిత్యావసరాలు, పెట్రోల్‌ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలి? మీ భూములు, ఆస్తులపై ఎవరి ఫొటో ఉండాలి. భూ పత్రాలపై రాజముద్ర కావాలా.. జగన్‌ ఫొటో కావాలా? వైకాపాను ఓడిస్తే తప్ప మీ భూములకు భద్రత ఉండదు. సంక్షేమ కార్యక్రమాలు ఏమీ నిలిచిపోవు... మరింత పెంచుతాం. వచ్చే ఐదేళ్లు అద్భుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా. మేం వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. చీపురుపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎప్పుడూ రైతు సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీ మాది. అప్పు తెచ్చి బటన్‌ నొక్కడం జగన్‌ పని.. సంపద సృష్టించి పేదలకు పంచడం నా పని. రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు మార్చే ఆయుధం ఓటు. కూటమి అభ్యర్థులను గెలిపించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img