లాక్‌డౌన్‌లో గిన్నిస్‌ రికార్డు కొట్టే అవకాశం

కరోనా వల్ల ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం బయటకు కూడా వెళ్లడానికి వీలు లేని ఈ సమయంలో గిన్నిస్‌ రికార్డు కొట్టే అవకాశం వచ్చింది. ఏ విషయంలో ప్రయత్నించాలి? ఎంత సాధన చేయాలి? దరఖాస్తు ఎలా చేయాలన్న మీమాంసాలొద్దు

Updated : 30 May 2022 16:38 IST

కరోనా వల్ల ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం బయటకు కూడా వెళ్లడానికి వీలు లేని ఈ సమయంలో గిన్నిస్‌ రికార్డు కొట్టే అవకాశం వచ్చింది. ఏ విషయంలో ప్రయత్నించాలి? ఎంత సాధన చేయాలి? దరఖాస్తు ఎలా చేయాలన్న మీమాంసాలొద్దు. ఎందుకంటే.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థే.. ప్రజలకు ఓ ఛాలెంజ్‌ విసిరింది. ఇంట్లోనే ఉండి ఆ ఛాలెంజ్‌లో పాల్గొంటే చాలు. అదెలా అంటారా వివరాలు ఇదిగో..

లాక్‌డౌన్‌.. హోం క్వారంటైన్‌తో ప్రజలు కాస్త విసిగిపోతున్నారు. ఇది గమనించిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సంస్థ.. ఓ వినూత్న ఛాలెంజ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే.. టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ను కాలితో ఫుట్‌బాల్‌లా ఎగరేస్తుండాలి. చేతులు, మోచేతులు మినహా శరీరంలో ఏ భాగంతోనైనా రోల్‌ను ఎగరేయొచ్చు. 30 సెకన్ల పాటు టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ కింద పడకుండా ఎగరేస్తూ తీసిన వీడియోను #GWRCHallenge హ్యాష్‌ ట్యాగ్‌ జతచేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలి. 30 సెకన్లలో ఎవరు ఎక్కువసార్లు టాయిలెట్‌ పేపర్‌ రోల్‌ను కిందపడకుండా ఎగరేస్తారో వారు గిన్నిస్‌ రికార్డు సాధించినట్లు.

ప్రతీ సోమవారం ఆ వారం రోజుల్లో వచ్చిన వీడియోలను గమనించి విజేతను సంస్థ ప్రకటిస్తుంది. ప్రతి వారం ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశముంటుంది. అయితే దీనికి కొన్ని నిబంధనలున్నాయి. పేపర్‌ రోల్‌ను ఎగరేసే క్రమంలో చేతులు, మోచేతులు ఉపయోగించకూడదు. కెమెరా ముందుకొచ్చాక 3, 2, 1 రెడీ అనుకున్న తర్వాతే ప్రారంభించాలి. ఎగరేస్తున్న క్రమంలో 30 సెకన్ల లోపు పేపర్‌ రోల్‌ కిందపడినా, గోడకు.. కుర్చీలకు తగిలినా ప్రయత్నం విఫలమైనట్లే. ముఖ్యంగా వీడియో ఒకే టేక్‌లో ఉండాలి. ఎడిట్‌ చేసినా, వీడియోలో కట్స్‌ కనిపించినా ఆ వీడియో అనర్హతకు గురవుతుంది. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియో తీసి.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్‌ చేయండి. రికార్డు సాధించండి.. ఆల్‌ ది బెస్ట్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని