హథ్రాస్‌ ఘటనలో అత్యాచారం నిజమే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ అత్యాచార ఘటనలో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని.....

Updated : 18 Dec 2020 16:56 IST

ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ అత్యాచార ఘటనలో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొంది. నలుగురు నిందితులపై అత్యాచారం, హత్య అభియోగాలు మోపింది. ఈ మేరకు సందీప్‌, లవ్‌కుష్‌, రవి, రాము అనే నలుగురిపై స్థానిక కోర్టులో అభియోగాలతో కూడిన ఛార్జిషీటు దాఖలు చేసింది.

హాథ్రాస్‌కు చెందిన ఓ దళిత బాలికపై సెప్టెంబర్‌ 14న ఉన్నత కులానికి  చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనపై దేశమంతా భగ్గుమన్న సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 29న మరణించింది. 30వ తేదీన అర్ధరాత్రే ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తమపై ఒత్తిడి తెచ్చి అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపారని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. కుటుంబ సభ్యుల అనుమతి మేరకే కార్యక్రమాలు పూర్తి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారం, అనంతర పరిణామాలపై విపక్షాలు భగ్గుమనడంతో యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఘజియాబాద్‌ యూనిట్‌కు చెందిన సీబీఐ అధికారులు నలుగురు నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పలు రకాల ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. అత్యాచార ఘటన అనంతరం తొలుత బాధితురాలు చికిత్స పొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ వైద్యులను విచారించారు. అలాగే, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఛార్జిషీటును దాఖలు చేశారు.

ఇవీ చదవండి..
గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి
రైతుల ఆందోళనలో బాలీవుడ్‌ నటి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు