పాక్‌ వెళ్లాలనుకున్న మరో ‘అంజు’.. కారణం తెలిసి అవాక్కైన పోలీసులు

సరైన పత్రాలు లేకుండా పాకిస్థాన్‌(Pakistan) వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ బాలికను జైపుర్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని అధికారులు ఆశ్చర్యపోయారు.

Published : 29 Jul 2023 17:45 IST

జైపుర్‌: ఫేస్‌బుక్‌లో పరిచయమైన స్నేహితుడి కోసం రాజస్థాన్‌(Rajasthan) నుంచి అంజు అనే మహిళ పాకిస్థాన్‌(Pakistan)కు వెళ్లింది. ఇటీవల తన స్నేహితుడిని వివాహం చేసుకున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇది మర్చిపోకముందే తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక(minor girl) కూడా అలాగే దేశం దాటాలని యత్నించిందని వార్తలు వచ్చాయి. అయితే ఆమెను కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ టీనేజర్ శుక్రవారం జైపుర్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఆమె వద్ద పాస్‌పోర్టు, వీసా, ఇతర ప్రయాణ పత్రాలు ఏవీ లేకపోవడంతో విమానాశ్రయ అధికారులు ఆమెను పోలీసులకు అప్పగించారు. పాక్‌లో ఉన్న స్నేహితుడిని కలుసుకోవడానికే వెళ్తున్నట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రుల సమక్షంలో అడగ్గా మాట మార్చింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకే తాను ఇలా చేసినట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు.

మొన్న సీమా.. నిన్న అంజు.. ఇవాళ జూలీ.. సరిహద్దులు దాటుతున్న ‘ప్రేమ’

‘జైపుర్ విమానాశ్రయం(Jaipur airport)లో నిన్న ఒక టీనేజర్‌ను అదుపులోకి తీసుకున్నాం. ఆమె స్నేహితుడిని కలుసుకునేందుకు లాహోర్‌ వెళ్లాలనుకుందని మాకు తెలిసింది. ఒక మైనర్ కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ అడిగేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె జోక్ చేస్తుందని అంతా భావించారు’ అని అధికారులు తెలిపారు.

విమానాశ్రయంలో అధికారులకు అనుమానం  రాకుండా ఎలా ప్రవర్తించాలో తనకు పాక్‌(Pakistan) స్నేహితుడు చెప్పాడని విచారణలో భాగంగా ఆమె తెలిపింది. అలాగే ఓ కట్టుకథ కూడా చెప్పింది. మూడు సంవత్సరాల క్రితమే తాను పాక్‌ నుంచి భారత్‌ వచ్చానని, తన బంధువు వద్ద ఉన్నానంటూ నమ్మించాలని చూసింది. అలాగే వారితో సరిపడక, పాక్‌ వెళ్లాలనుకున్నట్లు తెలిపింది. ఆమె చెప్పిన మాటలతో తామంతా ఆశ్చర్యపోయినట్లు ఓ అధికారి వెల్లడించారు.

ఇటీవల పాక్‌కు వెళ్లిన అంజుకు అప్పటికే వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా కోసం కొద్ది రోజుల క్రితం అట్టారి-వాఘా సరిహద్దు గుండా పాకిస్థాన్‌(Pakistan) వెళ్లింది. అక్కడే నస్రుల్లాను వివాహం చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని