Uttar Pradesh: ఆ ఆఫర్‌కు ఓకే చెప్తే రాహుల్‌ వెంట నడుస్తా.. కాంగ్రెస్‌కు అఖిలేశ్‌ కండీషన్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో  కాంగ్రెస్‌కు 17 సీట్లను సమాజ్‌వాదీ పార్టీ ఆఫర్‌ చేసింది.

Published : 19 Feb 2024 18:41 IST

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలోని ప్రాంతీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడం కాంగ్రెస్‌కు తలపోటుగా మారింది. దీంతో కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో కాంగ్రెస్‌కు 17 స్థానాలను ఆఫర్‌ చేసినట్లు ప్రకటించింది.

యూపీలో తమ మద్దతు కావాలంటే ఆఫర్‌ను అంగీకరించాలని కాంగ్రెస్‌కు షరతు పెట్టింది. తొలుత ఎస్పీ 11 సీట్లనే కేటాయించినా.. కాంగ్రెస్‌ డిమాండ్‌తో ఆ సంఖ్యను 17కి పెంచింది.  కాగా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. యూపీలోని అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌ కుటుంబానికి కంచుకోటలు. దీంతో ఎస్పీ ఈ రెండు స్థానాలకు దూరంగా ఉంది. అయితే, అమేఠీలో రాహుల్ గాంధీ.. భాజపా నేత స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.  దాంతో ఒక్క రాయ్‌బరేలీని గెలుచుకున్న కాంగ్రెస్‌.. యూపీలోని 80 ఎంపీ స్థానాలకు గానూ ఒక్క సీటుకే పరిమితమైంది.

రెండురోజుల్లో గుడ్‌న్యూస్‌ చెప్తా: కమల్‌ హాసన్‌

ఒకవేళ పొత్తు కుదిరినా, ఇతర స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయలేదని తెలుస్తోంది. ఎస్పీ ఇచ్చిన ఆఫర్‌పై హస్తం పార్టీ స్పందించాల్సి ఉంది. రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పాల్గొనడం ఆ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రలో అఖిలేశ్‌ పాల్గొంటారని హస్తం పార్టీ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇదిలాఉండగా.. కూటమిలో సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. దిల్లీలో కాంగ్రెస్‌కు ఆప్ ఒక్క సీటు మాత్రమే ఆఫర్‌ చేసింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో ఫరూక్‌ అబ్దుల్లా.. పంజాబ్‌లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాషాయ పార్టీతో జట్టు కట్టే అవకాశాలున్నట్లు ఆర్‌ఎల్‌డీ హింట్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని