Arvind Kejriwal: ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా..

Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ నేటి ఈడీ విచారణకు హాజరుకావడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించింది. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లు చట్ట వ్యతిరేకమని ఆరోపించింది. 

Updated : 19 Feb 2024 10:27 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు(Delhi Liquor Policy Case)లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోసారీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విచారణకు డుమ్మా కొట్టారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం.. సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులివ్వడం చట్టవిరుద్ధమని ఆప్‌ ఆరోపించింది.

‘‘ఈ సమన్లపై కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై దర్యాప్తు సంస్థనే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ పెండింగ్‌లో ఉండగా ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట వ్యతిరేకం. కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందే’’ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు ఆరుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన హాజరు కాలేదు.

రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదన

మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ ఇటీవల కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేయడంతో గత శనివారం కేజ్రీవాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే, ఆ రోజున విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, తదుపరి విచారణకు హాజరవుతానని సీఎం అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని