ఇకపై అలాంటి రోగులకు వైద్యులు నో చెప్పొచ్చు: నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌

వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (NMCRMP) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Updated : 11 Aug 2023 12:20 IST

దిల్లీ: రోగులు, వారి బంధువులు వైద్యులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ (NMCRMP) నియమావళి పేరుతో రూపొందించిన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. దీంతో ఇకపై వైద్యులతో అనుచితంగా ప్రవర్తించే రోగులకు చికిత్స నిరాకరించవచ్చని వెల్లడించింది. వైద్యులపై హింసను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ పేర్కొంది. ఇకపై కోడ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ 2002 స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ రెగ్యులేషన్‌ 2023 అమల్లోకి రానుంది.

రోగికి అందించే వైద్యం, ఫీజుకు సంబంధించిన వివరాలను తెలియజేసే బాధ్యత వైద్యులదే. చికిత్స ప్రారంభించే ముందే రోగికి కన్సల్టేషన్‌/చికిత్స ఫీజు గురించి తప్పక తెలియజేయాలని ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నిబంధనల్లో పేర్కొంది. ముందుగా చెప్పిన ప్రకారం ఫీజు చెల్లించకుంటే వైద్యుడు చికిత్స నిరాకరించొచ్చు. అయితే, అత్యవసర సేవల విషయంలో మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలిపింది. ఒకవేళ రోగి లేదా వారి బంధువులు దురుసుగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే.. వారి ప్రవర్తన గురించి రికార్డులో రాసి.. వేరేచోట తదుపరి చికిత్స చేయించుకునేలా వైద్యులు వారికి సూచించాలని తెలిపింది. ప్రాణాపాయ పరిస్థితులు మినహా వైద్యులు ఎవరికి చికిత్స అందించాలనేది పూర్తిగా వారి స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.

మణిపుర్ కల్లోలం.. మోదీకి మద్దతుగా అమెరికన్‌ సింగర్ ట్వీట్‌

రోగికి వైద్యం ప్రారంభించిన తర్వాత, వారి బంధువులకు సమాచారం అందించకుండా వైద్యుడు రోగికి చికిత్స నిరాకరించకూడదని ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ తెలిపింది. ఒకవేళ ప్రస్తుతం చికిత్స చేస్తున్న వైద్యుడితోపాటు అదనంగా మరో వైద్యుడు అవసరం ఉంటే దాని గురించి రోగి లేదా అతని కుటుంబసభ్యులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ఫార్మా సంస్థల నుంచి వైద్యులు అదనంగా ఎలాంటి బహుమతులు, ప్రయాణ సౌకర్యాలు పొందకూడదని నిబంధనల్లో పేర్కొంది. అలాగే, ఫార్మా సంస్థలు నిర్వహించే విద్యాసంస్థల్లో జరిగే వర్క్‌షాప్‌లు, సెమినార్‌ల్లో వైద్యులు పాల్గొనకూడదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని