Gold Smuggling: 20 కిలోల బంగారం స్వాధీనం.. పలువురి అరెస్టు

తమిళనాడులో ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో 20కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Published : 01 Aug 2023 19:36 IST

చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేసిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు..  వారి నుంచి 20కిలోలకు పైగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹12.5కోట్లు ఉంటుందని అంచనా.  సోమవారం మూడు వేర్వేరు ఘటనల్లో ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.  శ్రీలంక నుంచి ఫిషింగ్ బోట్‌లో తంగచిమడం (రామనాథపురంలో) ద్వారా విదేశీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దాన్ని అక్కడి డెలివరీ చేస్తారని తెలుసుకున్న అధికారులు గట్టి నిఘా ఉంచారు. తంగచిమడం ఉత్తర తీరానికి సమీపంలో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.37 కోట్లు విలువ చేసే 9.063 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

తగ్గిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

అలాగే,  డీఆర్‌ఐ అధికారులతో కూడిన మరో బృందం సోమవారం షార్జా నుంచి కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసి వారి నుంచి 5.17 కేజీల బంగారం సీజ్‌ చేసింది. ఈ పసిడి విలువ ₹3.17కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు.. వారిని రిమాండ్‌కు తరలించారు. అలాగే, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల సుమారు రూ. 3.8 కోట్ల విలువైన 6.275 కిలోల బంగారం పేస్ట్‌ తరలిస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి దాంతో ఇంకెవరికైనా సంబంధం ఉందేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 29 కేసుల్లో 163 కిలోల బంగారం సీజ్‌ చేశామని.. దీని విలువ రూ.97 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని