తప్పు చేయొద్దు..సుదీర్ఘకాలం మనతోనే కరోనా!

మానవాళిని పీడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచంమీద సుదీర్ఘకాలం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. కొన్ని దేశాలు ఈ వైరస్‌ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ..కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ వెల్లడించారు.

Published : 23 Apr 2020 11:55 IST

జెనీవా: మానవాళిని పీడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి ప్రభావం ప్రపంచంమీద సుదీర్ఘకాలం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. కొన్ని దేశాలు ఈ వైరస్‌ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ..కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనామ్‌ వెల్లడించారు. ‘తప్పు చేయొద్దు, ఈ వైరస్‌ సుదీర్ఘకాలం మనతోనే ఉంటుందని’ డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్‌ జనరల్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. చాలా దేశాలు లాక్‌డౌన్‌ ను సడలించాలని అనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అప్రమత్తం చేసింది. అయితే, మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ..ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో ఈ వైరస్‌ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో కరోనా బారినపడ్డ దేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గిందని భావిస్తున్నప్పటికీ మళ్లీ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న విషయం గమనించాలన్నారు.

కరోనా తీవ్రతను ఆదిలోనే పసిగట్టిన డబ్ల్యూహెచ్ఓ సరైన సమయంలోనే(జనవరి 30వ తేదీనే) అంతర్జాతీయ అత్యయికస్థితి ప్రకటించిందని వెల్లడించారు. అప్పటికే అన్ని దేశాలకు సన్నద్ధమయ్యేందుకు చాలా సమయం ఉందనే విషయాన్ని నొక్కిచెప్పారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరైన సమయంలో స్పందించిందని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించే క్రమంలో సరిగా వ్యవహరించని కారణంగా డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేయాలని అమెరికా చేసిన వ్యాఖ్యలను టెడ్రోస్‌ తిరస్కరించారు. డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేతపై నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడగా లక్షా 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి.

ముందుంది మహోత్పాతం!

భారత్‌లో 21వేల కేసులు, 681మరణాలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని