6 రాష్ట్రాలు.. 116 జిల్లాలు.. 125 రోజులు!

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలివెళ్లిపోయిన వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌......

Published : 18 Jun 2020 18:59 IST

వలస కూలీలకు కేంద్రం కొత్త పథకం
20న ప్రారంభించనున్న మోదీ

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు తరలివెళ్లిపోయిన వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పేరిట దేశంలోని మొత్తం ఆరు రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో వలస కూలీలకు పనులు కల్పించనుంది. రూ.50వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకం వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘‘కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంలో దేశంలోని వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కోరుకున్నారు. దీంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తగు ఏర్పాట్లు చేసి వారిని స్వస్థలాలకు తరలించాయి. ఏయే జిల్లాలకు వలస కూలీలు పెద్ద ఎత్తున తరలివెళ్లారో గుర్తించాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల్లో బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందినవారే అధికం. ఆయా జిల్లాల్లో 25వేల మందికి పైగా వలస కూలీలకు నైపుణ్యాల ఆధారంగా 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి నైపుణ్యాలపై అధ్యయనం చేసి మ్యాప్‌ రూపొందిస్తాయి.  125 రోజుల్లో ఈ జిల్లాల్లో దాదాపు 25 ప్రభుత్వ పథకాలను గరీభ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ కిందకు తీసుకొచ్చి వలస కార్మికులకు ఉపాధి కల్పనపై  చర్యలు చేపడుతున్నాం. ఆయా జిల్లాల్లోని గ్రామాలు కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, కృషి విజ్ఞాన్‌ కేంద్రాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లోని ఖగారియా జిల్లా తెలిహర్‌ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన వేలాది మంది కార్మికులకు ఈ పథకం ఉపశమనం కలిగించనుంది’’ అని అన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు