Vande Bharat Express: వందేభారత్‌కు సురక్షిత కవచం!

రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూసేందుకు దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ ‘కవచ్‌’ను రైల్వే అధికారులు శుక్రవారం తొలిసారిగా వందేభారత్‌ రైలుపై విజయవంతంగా పరీక్షించారు.

Updated : 17 Feb 2024 09:17 IST

160 కి.మీ. వేగం వద్ద పరీక్ష విజయవంతం

దిల్లీ: రైళ్లు పరస్పరం ఢీ కొట్టుకోకుండా చూసేందుకు దేశీయంగా రూపొందించిన యాంటీ కొలిజన్‌ డివైస్‌ ‘కవచ్‌’ను రైల్వే అధికారులు శుక్రవారం తొలిసారిగా వందేభారత్‌ రైలుపై విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ రైలుకు ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసింది. 8 బోగీలున్న వందేభారత్‌ రైలుపై దీన్ని పరీక్షించారు. ‘కవచ్‌’ను రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌వో) సంస్థ రూపొందించింది. అత్యవసర సమయంలో లోకోపైలట్‌ సకాలంలో బ్రేకులు వేయకుంటే ఇది స్పందించి రైలును ఆపేస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య తాజా పరీక్ష జరిగింది. ఇందులో రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపారు. లోకోపైలట్‌ దీనికి బ్రేక్‌లు వేయలేదు. అయినా అందులోని ‘కవచ్‌’ వ్యవస్థ.. రెడ్‌ సిగ్నల్‌ను గుర్తించి, బ్రేక్‌ వేసింది. సిగ్నల్‌కు 10 మీటర్ల దూరంలో రైలును ఆపేసింది.

తాజా ప్రయోగం ఆధారంగా.. దేశవ్యాప్తంగా 8 బోగీలున్న వందేభారత్‌ రైళ్లలోని కవచ్‌ వ్యవస్థకు ప్రమాణాలను ఖరారు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థకు స్టేషన్‌ కవచ్‌, పట్టాల వెంబడి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు, కవచ్‌ టవర్లు అవసరం. వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. తదుపరి 16 బోగీలున్న వందేభారత్‌ రైళ్లపై దీన్ని పరీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని