Ayodhya ram mandir: శరవేగంగా అయోధ్య రామాలయ నిర్మాణం పనులు

అయోధ్య రామమందిర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆలయ ట్రస్టు సభ్యుడు చంపత్‌రాయ్‌ ట్విటర్‌ వేదికగా మందిరం నిర్మాణ ఫొటోలను పంచుకున్నారు.

Published : 07 Apr 2023 14:20 IST

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు  సగం పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణ ఫొటోలను ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. 2023 చివరి నాటికి ఈ మందిరం సిద్ధమవుతుందని తెలిపారు. గర్భగుడిలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత 2024 మకర సంక్రాంతి తర్వాత నుంచి అయోధ్య రాముడిని దర్శించుకొనేందుకు భక్తులను అనుమతించనున్నట్టు ఇప్పటికే ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఈ పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాం 51 అంగుళాలు ఉంటుంది. వాస్తును పరిగణనలోకి తీసుకొని రామ మందిరం, పరిసరాల విస్తీర్ణాన్ని 67 ఎకరాల నుంచి 110 ఎకరాలకు పెంచినట్లు ఆలయ ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు. భారతీయ సంస్కృతిని తెలియజేసే చిత్రాలతో కూడిన కుడ్యాలను రామమందిరంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం దిల్లీలోని ‘ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌’తో పాటు, మత పెద్దలు, కళా నిపుణుల బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆలయం కాకుండా, ఇక్కడ మ్యూజియం, డిజిటల్ ఆర్కైవ్స్ పరిశోధనా కేంద్రం కూడా ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని