దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ- స్పీకర్ల సదస్సులో చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమౌతున్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల

Published : 29 Nov 2020 18:09 IST

చర్చనీయాంశమైన ప్రధాని మోదీ ప్రతిపాదన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ- స్పీకర్ల సదస్సులో చేసిన ప్రతిపాదనతో మరోమారు జమిలి ఎన్నికలు చర్చనీయాంశమౌతున్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఈ జమిలిపై ఇప్పటికే మోదీ అనేకసార్లు తన సానుకూలతను వ్యక్తంజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోమారు ఆయన తన మనసులో మాట బయటపెట్టారు! ఇంతకూ జమిలి ఎన్నికలు సాధ్యమేనా? వాటివెనకాలున్న సాధకబాధకాలేంటి? జమిలిపై ఇప్పటిదాకా జరిగిన కసరత్తేంటి?... చూస్తే...

ఆడ్వాణీ ఆద్యుడు...

* ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఆద్యుడు భాజపా అగ్రనేత ఎల్‌.కె.ఆడ్వాణీ! 1990 చివర్లో ఆయనీ ప్రతిపాదన తెచ్చారు. ఆ తర్వాత నరేంద్రమోదీ మళ్లీ దాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.

* 2015లో న్యాయశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ కూడా జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది.

* 2021 కల్లా రెండుదశల్లో జమిలి ఎన్నికలు నిర్వహించొచ్చంటూ గతంలో నీతి ఆయోగ్‌ ఒక నివేదిక కూడా సమర్పించింది.

* 2017లో అప్పటి ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ ఓపీ రావత్‌ జమిలి ఎన్నికలకు కమిషన్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

* 2018లో లా కమిషన్‌ దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా... అన్నాడీఎంకే, అకాలీదళ్, సమాజ్‌వాదీ పార్టీ, తెరాస మద్దతిచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, తెదేపా, సీపీఐ, సీపీఎం, జనతాదళ్‌లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. భాజపా, కాంగ్రెస్‌లు తటస్థంగా ఉండిపోయాయి.

అప్పుడలాగే జరిగాయి...

జమిలి ఎన్నికలు నిజానికి కొత్తేమీ కాదు. గతంలో మన దేశంలో జరిగాయి కూడా! 1951 నుంచి 1967 దాకా లోక్‌సభ, అసెంబ్లీలకు (ఎక్కువశాతం) ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1957లో 76శాతం రాష్ట్రాల అసెంబ్లీకు లోక్‌సభతో పాటు ఎన్నికలైతే; 1967 నాటికి ఈ శాతం 67శాతానికి తగ్గింది. 1968-69లో కొన్ని అసెంబ్లీలు ముందుగానే రద్దయ్యాయి. 1970లో లోక్‌సభ కూడా రద్దయింది. అప్పట్నుంచి రాష్ట్రాల, లోక్‌సభ ఎన్నికలు పట్టాలు తప్పి విడివిడిగా నడుస్తున్నాయి.

10 దేశాల్లో ఇదే పద్ధతి...

జమిలి ఎన్నికల్ని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అనుసరిస్తున్నాయిప్పటికే! ఈ జాబితాలో స్వీడన్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగేరీ, బెల్జియం, పోలండ్, స్లొవేనియా, అల్బేనియా... తదిరత దేశాలున్నాయి. స్వీడన్‌లో నాలుగేళ్ళకోసారి సెప్టెంబరులో వచ్చే రెండో ఆదివారం అన్ని రాష్ట్రాలు, జాతీయ ఎన్నికలతోపాటు స్థానిక (మున్సిపాలిటీలకు) ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇండోనేసియాలో కూడా ఇప్పుడు ప్రతి ఐదేళ్ళకోసారి ఇదే పద్ధతిలో రాష్ట్రాలు, జాతీయ ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో చాలా దేశాలు అధ్యక్ష తరహా పాలనలో ఉన్నవి కావటం గమనార్హం!

రాజ్యాంగ సవరణ అవసరం...

అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభకు ఇకమీదట ఎప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. జమిలి ఎన్నికలంటే అనేక రాష్ట్రాలు తమ పదవీకాలం ముగియకముందే అసెంబ్లీను రద్దు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఆర్టికల్‌ 356 ద్వారా అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికుంది. మరే రకంగా చేసినా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి, అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించాలన్నా, పెంచాలన్నా సవరణ అవసరం. అది కూడా మూడింట రెండొంతుల మెజార్టీతో!

పదేపదే జమిలి మంత్రం పఠిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సర్కారు, కశ్మీర్, ముమ్మారు తలాఖ్‌ల మాదిరిగా మెజార్టీ పార్టీలను ఒప్పించి, తాననుకున్నట్లు రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరం!

జమిలి ఎందుకంటే...

* పదేపదే ఎన్నికల గురించి ఆలోచించకుండా ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టిసారించొచ్చు.

* ఓట్ల శాతం పెరుగుతుంది.

* ఖర్చు తగ్గుతుంది

* అవినీతి, నల్లధన వినియోగం తగ్గుతుంది.

* సిబ్బంది వినియోగం; నిర్వహణ ఖర్చు ఆదా!

ఎందుకు వద్దంటే...

* రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం

* గడువులోపే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోతే ఎలా?

* జాతీయ పార్టీలకు లాభం చేకూరొచ్చు. ఎందుకంటే జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకు కూడా ప్రజలు ఓటు వేస్తే ప్రాంతీయ పార్టీలు దెబ్బతిని, జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇది క్రమంగా  అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుంది.

* పార్టీల ఖర్చేమీ తగ్గకపోవచ్చు.

* ప్రభుత్వాలు ముందస్తుగానే అవిశ్వాసం ఎదుర్కొని కూలిపోతే ఎలా అనేది జమిలి ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా నిలవటంతో... 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వ హయాంలో అప్పటి లా కమిషన్‌ ఒక ప్రతిపాదన చేసింది. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు... ప్రత్యామ్నాయంగా (విశ్వాస తీర్మానం నెగ్గగల) ఎవరు నెగ్గుతారో చూపించాలనే నిబంధన పెట్టాలని సిఫార్సు చేసింది.

* అలాగే ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు జాతీయ అంశాలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయకపోవచ్చనే ఉదాహరణలు కూడా ఉన్నాయి. 2004 నుంచి నాలుగుసార్లు ఒడిసా అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరిగాయి. ఫలితాలెప్పుడూ వేర్వేరుగానే   ఉంటున్నాయి.

- ఈనాడు ప్రత్యేక విభాగం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని