Study: కరోనా టీకాకు.. గుండెపోటు ముప్పుకు సంబంధం లేదు!

భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు (Heart Attack) ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 05 Sep 2023 01:56 IST

దిల్లీ: కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ తర్వాత దేశంలో గుండెపోటు ముప్పు పెరిగిందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ప్రభావం గుండెపోటు (Heart Attack) కేసులు పెరగడానికి ఏమైనా కారణమా అనే అనుమానాలు వచ్చాయి. ఈ కోణంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పరిశోధనలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్‌లో వినియోగించిన కరోనా వ్యాక్సిన్లకు, గుండెపోటు ముప్పు పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌లు (Corona Vaccine) సురక్షితమైనవేనని పరిశీలన అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక.. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

‘భారత్‌లో వ్యాక్సిన్‌లు సురక్షితమని మా అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో గుండెపోటుకు వ్యాక్సిక్‌లతో సంబంధం లేదు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండెపోటు మరణాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో గుర్తించాం’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన జీబీ పంత్‌ ఆస్పత్రికి చెందిన మోహిత్‌ గుప్తా వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (AMI) ఎప్పుడూ కనిపించలేదని తమ విశ్లేషణలో తేలినట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఏఎంఐ బాధితుల్లో.. వయసు, మధుమేహం, ధూమపానం కారణాల వల్లే మరణం ముప్పు ఎక్కువగా కనిపించిందన్నారు. అయితే, ఇది ఒకే కేంద్రంలో జరిపిన అధ్యయనమని.. ఇందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

Chandrayaan-3: కర్తవ్యం పరిసమాప్తం!.. నిద్రాణంలోకి ల్యాండర్‌..!

గుండెపోటు తర్వాత బాధితుల మరణానికి సంబంధించి వ్యాక్సిన్‌ ప్రభావం ఏమైనా ఉందా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గతేడాది మన దేశంలోనే ఓ అధ్యయనం జరిగింది. ఇందుకోసం దిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో ఆగస్టు 2021-ఆగస్టు 22 మధ్య కాలంలో చేరిన 1578 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించారు. వీరిలో 1086 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కాగా.. 492 మంది టీకా తీసుకోనివారే. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 1047 (96 శాతం) మంది రెండు డోసులు తీసుకోగా.. మరో 4శాతం మాత్రం కేవలం ఒక డోసు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని