ఫోన్‌ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్‌ ఇచ్చిన అధికారికి జరిమానా!

నీటిలో ఫోన్‌ పడిపోయిందని చెప్పగానే రిజర్వాయర్‌లో నీటిని తోడేసేందుకు అనుమతించిన ఛత్తీస్‌గఢ్‌ నీటిపారుదల శాఖ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. నీటిని వృథా చేసినందుకు అతడికి జరిమానా విధించారు. 

Updated : 30 May 2023 17:15 IST

రాయ్‌పూర్‌: తన ఖరీదైన ఫోన్‌(Smart Phone) నీటిలో పడిపోయిందని ఓ అధికారి ఏకంగా రిజర్వాయర్‌నే తోడించి లక్షల లీటర్ల నీటిని వృథా చేసిన నిర్వాకం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సదరు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌(Food Inspector)ను  అప్పుడే సస్పెండ్‌ చేయగా.. అందుకు అనుమతించిన నీటిపారుదల శాఖ అధికారికి ప్రభుత్వం తాజాగా జరిమానా విధించింది. నీటిని వృథా చేసినందుకు గాను రూ.53వేలు జరిమానా విధిస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఈ నెల 26న సబ్‌ డివిజనల్ అధికారి(ఎస్‌డీవో) ఆర్‌కే ధివర్‌కు లేఖ రాశారు. డ్యామ్‌లోని ఐదు అడుగుల వరకు నీటిని తోడేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చి 42లక్షల లీటర్ల నీటిని వృథా చేసినందుకు ఆ నీటికయ్యే ఖర్చును జీతం నుంచి ఎందుకు రికవరీ చేయకూడదని పేర్కొన్నారు.  అలాగే, ఈ వేసవిలో సాగునీరు, ఇతర అవసరాల కోసం అన్ని రిజర్వాయర్లలో నీరు అత్యంత అవసరమని తెలిపారు. 

కాంకేర్‌ జిల్లాలోని కోయిలిబెడ బ్లాక్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న  రాజేశ్‌ విశ్వాస్‌ ఇటీవల తన స్నేహితులతో కలిసి విహారం కోసం పరల్‌కోట్‌ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు.  వారితో సరదాగా సెల్ఫీ దిగుతున్న సమయంలో రూ.96 వేల విలువైన శామ్‌సంగ్‌ ఎస్‌23 ఫోను నీళ్లలో పడిపోయింది. కంగారుపడిన రాజేశ్‌ జలవనరుల శాఖ అధికారులకు ఫోను చేసి విషయం చెప్పారు. 30 హెచ్‌పీ సామర్థ్యం గల పంపులతో జలవనరుల శాఖ సిబ్బంది క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమై జలాశయం నీటిని తోడే పనిని ప్రారంభించారు. మూడు రోజులు గడిచేసరికి దాదాపు 41 లక్షల లీటర్ల నీటిని వృథాగా బయటకు తోడేశారు. మూడు రోజుల తర్వాత ఆ ఫోన్‌ను బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ను సస్పెండ్‌ చేసిన కాంకేర్‌ జిల్లా కలెక్టర్‌..  జలవనరుల శాఖ ఎస్‌డీవో ధివర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఫోన్‌ కోసం డ్యామ్‌ను ఖాళీ చేయించేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన ఎస్‌డీవోకు  ఇంద్రావతి ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రూ.53వేలు జరిమానా విధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని