Imran Khan: మహాత్మా గాంధీ, మండేలాలే నాకు స్ఫూర్తి : పాక్‌ మాజీ ప్రధాని

స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన నెల్సన్‌ మండేలా, మహాత్మాగాంధీ (Mahatma Gandhi), జిన్నా లాంటి నిస్వార్థ సేవకులే తనకు స్ఫూర్తి అని పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) వ్యాఖ్యానించారు.

Updated : 04 Jul 2023 19:17 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో (Pakistan) కొంతకాలంగా రాజకీయ కల్లోలం కూడా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) అరెస్టు తర్వాత పీటీఐ పార్టీ నేతల అరెస్టులు, ఆందోళనలు, బెయిల్‌ కోసం న్యాయస్థానాల చుట్టు తిరగడం వంటివి నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోపినా.. అరెస్టు చేసి జైల్లో పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన మహాత్మా గాంధీ, నెల్సన్‌ మండేలా వంటి దిగ్గజ నేతలతో తనను పోల్చుకున్నారు. అంతర్జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్‌కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అంశాలను పరిశీలిస్తే..

నన్ను మళ్లీ జైల్లో పెడతారు..

‘వాళ్లు నన్ను మళ్లీ జైల్లో పెడతారని తెలుసు. దానికి సమయం ఏమీ పట్టదు. ఎందుకంటే.. నేను బయట ఉంటే నా పార్టీకి ఎంతో బలం ఉంటుందనే భయం వారిలో ఉంది. అందుకే మమ్మల్ని జైల్లో పెట్టి ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు వేల మంది పీటీఐ కార్యకర్తలను నిర్బంధించారు. మా పార్టీకి భయపడే నన్ను జైలుకు పంపించేందుకు యత్నిస్తున్నారు. తద్వారా నాపై అనర్హత వేటు వేయాలన్నది వారి వ్యూహం. అయినప్పటికీ నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నా. మమ్మల్ని ఎంత అణచివేసేందుకు ప్రయత్నిస్తే.. పార్టీకి (PTI) అంత మద్దతు లభిస్తుంది’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లక్ష్యాలు లేవని.. నెల్సన్‌ మండేలా, మహాత్మా గాంధీలతోపాటు మహమ్మద్‌ అలీ జిన్నా వంటి నేతల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు.

గాంధీ, మండేలా నిస్వార్థ సేవకులు..

‘రాజకీయాలే కెరీర్‌గా నేను ఇందులోకి రాలేదు. రాజకీయాలను వృత్తిగా భావించేందుకు నేను ఎవ్వరినీ ప్రోత్సహించను. నా కుమారులను కూడా రాజకీయాల్లోకి రావద్దనే చెబుతా. ఎందుకంటే అదో వరస్ట్‌ కెరీర్‌. రాజకీయాలంటే ఓ లక్ష్యంతో కూడుకున్నవి. నెల్సన్‌ మండేలా (Nelson Mandela), మహాత్మాగాంధీ (Mahatma Gandhi), జిన్నా (Muhammad Ali Jinnah) లాంటి వాళ్లు స్వేచ్ఛ కోసం పోరాటం చేశారు. వారు నిస్వార్థ సేవకులు. అందుకే వారు నాకు స్ఫూర్తి. వారెప్పుడూ అధికారం కోసం ప్రయత్నించలేదు. ఓ లక్ష్యం కోసం పోరాడారు’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాము ఓ లక్ష్యంతో పనిచేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పీటీఐదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇమ్రాన్‌పై ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో కేసులు నమోదు చేసింది. అవినీతి, హత్యలు, దాడులు, దేశద్రోహం, ఉగ్రవాదం వంటి దాదాపు 170 కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని, కేవలం ఇమ్రాన్‌ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ అభియోగాలు మోపుతున్నారని ఇమ్రాన్‌ పార్టీ ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు