రంగమ్మత్త పాత్ర రాశీకే వచ్చింది.. కానీ..!

బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశీ. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన

Published : 01 Dec 2020 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత కథానాయికగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశీ. వివాహం అనంతరం సినిమాలకు దూరమైన ఆమె, రీఎంట్రీలో భాగంగా పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే, రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర కోసం తొలుత రాశీని సంప్రదించింది చిత్ర బృందం. కథ నచ్చినా, కొన్ని కారణాల వల్ల ఆమె రంగమ్మత్త పాత్రను చేయడానికి ఒప్పుకోలేదు. అందుకు కారణాన్ని ఒక సందర్భంగా రాశీ పంచుకున్నారిలా..!

‘‘అది చాలా మంచి పాత్ర. కానీ, ఆ పాత్ర ప్రకారం మోకాళ్లపై వరకూ చీర కట్టుకుని ఉండాలి. ఆ లుక్‌ నాకు సరిపోదేమోనని అనిపించింది. ఆ సినిమా గురించి, నా పాత్ర గురించి చెప్పారు. నేనే ఒప్పుకోలేదు’’ అని చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆ పాత్రను బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ చేయడం మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగిపోయాయి. ఇక ‘నిజం’ సినిమాలో తాను పోషించిన నెగెటివ్‌ పాత్రను చేయకుండా ఉండాల్సిందని అని కూడా చెప్పుకొచ్చారు.

‘‘సాధారణంగా నేను ఎవరి ఆఫీస్‌లకు వెళ్లను. అలాంటిది తేజ పిలిచారని ఆయన ఆఫీస్‌కు వెళ్లా. ‘నిజం’ కథ చెప్పి మహేశ్‌బాబు హీరో అన్నారు. ‘గోపీ చంద్‌.. నువ్వు లవర్స్‌. మధ్యలో విలన్‌  వస్తాడు. మొత్తం మీదే లవర్‌స్టోరీ నడుస్తుంది’ అని చెప్పడంతో నేనూ ఒప్పుకొన్నా. షూటింగ్‌ వెళ్లిన తర్వాత ఫస్ట్‌సీన్‌ తీయగానే నాకు అర్థమైపోయింది. దీంతో సినిమా నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఇదే విషయాన్ని మా పీఆర్వో బాబూరావుగారికి చెప్పా. ‘మేడమ్‌ మీరు ఇప్పటివరకూ ఏ సినిమా విషయంలో ఇలా చేయలేదు. సడెన్‌గా ఇలా చేస్తే, ఇండస్ట్రీలో బ్యాడ్‌ అవుతారు. ఒప్పుకొన్నారు కదా! ఈసారికి కానిచ్చేయండి’ అన్నారు. మా అన్నయ్య కూడా ‘పోనీలే చెయ్’ అన్నాడు. దీంతో ఒప్పుకోక తప్పలేదు. కానీ,  పాత్రకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు చాలా బాగా చేశారంటే... మరికొందరు ‘ఎందుకు ఒప్పుకొన్నారు మేడమ్‌’ అన్నారు. నాగబాబుగారు ఫోన్‌ చేసి, ‘నీ పాత్ర నెగిటివ్‌గా ఉన్నా, నువ్వు కత్తిలా ఉన్నావ్‌’అంటూ మెచ్చుకున్నారు’’ అని రాశీ ‘నిజం’లో పాత్ర గురించి పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని