అనసూయ @ అర డజను చిత్రాలు

న్యూస్‌రీడర్‌గా కెమెరా ముందుకు వచ్చి.. యాంకర్‌గా కుర్రకారు హృదయాలను దోచి.. నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు అనసూయ భరద్వాజ్‌. ఇటీవల ఈ ముద్దుగుమ్మ కేవలం నటిగానే కాకుండా ‘విన్నర్‌’లో స్పెషల్‌ సాంగ్‌...

Updated : 08 Feb 2021 20:35 IST

ఈ బ్యూటీ ఫుల్‌ బిజీగా

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూస్‌రీడర్‌గా కెమెరా ముందుకు వచ్చి.. యాంకర్‌గా కుర్రకారు హృదయాలను దోచి.. నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు అనసూయ భరద్వాజ్‌. ఇటీవల ఈ ముద్దుగుమ్మ కేవలం నటిగానే కాకుండా ‘విన్నర్‌’లో స్పెషల్‌ సాంగ్‌ చేసి అందరి చూపులను తనవైపునకు తిప్పుకున్నారు. దీంతో ఈ యాంకరమ్మకు సినిమాల్లో అవకాశాలు వరుసకట్టాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఆఫర్‌ దక్కించుకున్న ఈ భామ 2021లో షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండనున్నారు. ఇంతకీ అనసూయ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లు ఏమిటో? అవి ఏ దశలో ఉన్నాయి? ఓసారి మీరు చూసేయండి..!

‘పుష్ప’లో ఉన్నట్టా లేనట్టా?

అల్లుఅర్జున్‌-సుకుమార్‌ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనసూయ కీలకపాత్రలో కనిపించనున్నట్లు ఒకానొక సమయంలో వరుస కథనాలు వచ్చాయి. ‘రంగస్థలం’తో రంగమ్మత్తగా అనసూయను ప్రేక్షకులకు చేరువ చేసిన సుకుమార్‌ ఈ సినిమాలో కూడా కీ రోల్‌ ఇచ్చారంటూ కొంతమంది చెప్పుకున్నారు. మరికొంతమంది మాత్రం.. అనసూయ ఓ స్పెషల్‌ సాంగ్‌లో మాత్రమే కనిపించనున్నారని అన్నారు. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు సరికాదా..! ఈ మధ్య కాలంలో ‘పుష్ప’ నుంచి ఆమె వైదొలగిందంటూ ప్రచారం సాగింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.


‘ఖిలాడి’తో ఆటపాట..!

‘క్రాక్‌’తో ఫామ్‌లోకి వచ్చిన మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జంటగా డింపుల్‌ హయాతి, మీనాక్షి చౌదరి నటించనున్నారు. ప్రముఖ నటుడు అర్జున్‌ ఇందులో కీలకపాత్ర పోషించనున్నారు. కాగా, ఈ సినిమాలో అనసూయ కూడా భాగమైనట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఇందులో ఆమె రవితేజతో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడనున్నారట.


బస్తీబాలరాజుతో..

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం చేసేందుకు అనసూయ ఓకే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేవలం కొన్ని నిమిషాల పాట కోసం ఆమె భారీగా పారితోషికం డిమాండ్‌ చేసినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


రంగమార్తాండ..

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న విభిన్న కథా చిత్రం ‘రంగమార్తాండ’. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక, రాహుల్‌ సిప్లింగజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘నట్‌సామ్రాట్‌’ అనే మరాఠి చిత్రానికి రీమేక్‌గా రానున్న ఈ సినిమాలో అనసూయ కీ రోల్‌లో కనిపించనున్నారు.


థ్యాంక్యూ బ్రదర్‌

నటుడు విరాజ్‌ అశ్విన్‌, ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్‌’. రమేష్‌ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయ గర్భవతిగా విభిన్నమైన పాత్రలో నటించారు. త్వరలో ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్‌ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకోనుంది.


ది ఛేజ్‌..

ఎంతోకాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న అనసూయ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ది ఛేజ్‌’. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రైజా విల్సన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇదీ చదవండి

మీకేం తెలుసని నన్ను తిడుతున్నారు: అనసూయ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని