Chiranjeevi: ఆ సంతోషాన్ని మాటల్లో వివరించలేను: చిరంజీవి

ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’.. ఈ సినిమా విజయోత్సవ వేడుకకు ప్రముఖ హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 30 Jul 2023 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనతోపాటు తన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు విజయం సాధించడంపై అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. ఆ సంతోషాన్ని మాటల్లో వివరించలేనన్నారు. ‘బేబీ’ (Baby) సినిమా విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్‌ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహిచింది.

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో నిజమైన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆయనే: రామ్‌చరణ్‌

వేడుకనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ వాతావరణం చూస్తుంటే బేబీ సినిమా విజయోత్సవ వేడుకకు వచ్చానో, నా సన్మాన సభకు వచ్చానో అర్థం కావడంలేదు. పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నా.. తోబుట్టువుల అభివృద్ధి చూసి ఆనందిస్తున్నా.. నా మేనల్లుళ్లు, మిత్రులు నాతోపాటు ఎదుగుతూ విజయాలు అందుకుంటుంటే ఆ సంతోషం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. దేవుడు ఇచ్చిన తమ్ముళ్లు నా అభిమానులు. వీరిలో చాలామంది నన్ను స్ఫూర్తిగా తీసుకుని, చిత్ర పరిశ్రమకు వచ్చి తమకంటూ ప్రత్యేకత గుర్తింపు పొందుతున్నారు. దాన్ని చూసి నేను పొందే ఉత్సాహం అంతా ఇంతా కాదు. బేబీ సినిమా దర్శక, నిర్మాతలు సాయి రాజేశ్‌, ఎస్‌.కె.ఎన్‌. నాకు ఎప్పటి నుంచో తెలుసు. తరచూ కలవపోయినా వారి ప్రయాణాన్ని గమనిస్తూనే ఉన్నా. అభిమానులుగా థియేటర్ల దగ్గరే ఆగిపోకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ ఓ మార్క్ క్రియేట్‌ చేసుకున్నారు. ఈ విషయంలో నాకంటే ఎక్కువగా ఆనందించేవారుండరు. సినిమా అభిమానులంటే ఒకప్పుడు కొందరిలో దురాభిప్రాయం ఉండేది. ఇదే ఇండస్ట్రీలో ఉండి.. సమాజం గర్వపడేలా నా అభిమానుల్ని తీర్చిదిద్దాలని నా కెరీర్‌ ప్రారంభంలోనే నిర్ణయించుకున్నా. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానుల్ని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. నా అభిమానుల ప్రయత్నం ఇంత విజయం సాధించినందుకు అభినందించడానికే ఇక్కడకు వచ్చా’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని