‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్‌ పోగొట్టాడు’

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన చేసినన్ని ప్రయోగాత్మక సినిమాలు మరో

Published : 08 Feb 2020 14:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన చేసినన్ని ప్రయోగాత్మక సినిమాలు మరో దర్శకుడు చేయలేదంటే అతిశయోక్తికాదు. మాటలు లేకుండా సినిమా తీయడం సాధ్యమేనా? అసలు ఎవరైనా చూస్తారా? కానీ, సింగీతం శ్రీనివాసరావు తీస్తే చూశారు. కమల్‌హాసన్‌, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ‘పుష్పక విమానం’ బాక్సాఫీస్‌ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం పెద్ద ప్రహసనమే నడిచింది. దాని వెనుక ఉన్న కథను సింగీతం ఓ సందర్భంలో పంచుకున్నారు. 

‘‘మొదట ఈ కథకు నీలమ్‌ కొఠారి అనే ముంబయి నటిని అనుకున్నాం. నేను వెళ్లి ఆమెను చూసి, ఒకే కూడా చేశాను. అయితే, ఆమె కొన్ని షరతులు పెట్టారు. ‘నాతో పాటు మా హెయిర్‌ స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వస్తుంది’ అని నీలమ్‌ చెప్పింది‌. ‘ఇదొక ప్రత్యేక చిత్రం. సాధారణం చిత్రమైతే మీరు అడిగినవన్నీ ఇచ్చేవాళ్లం’ అని నేను చెప్పాను. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ దశలో రమేశ్‌ సిప్పీని కలిస్తే, ‘ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటివరకూ ఆమె నటించిన నాలుగైదు చిత్రాలు సగంలో ఆగిపోయాయి. ఒక్కటి కూడా విడుదలకు నోచుకోలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐరన్‌లెగ్‌. మీకు అలాంటి సెంటిమెంట్‌లు లేకపోతే వెళ్లి కలవండి. ఆమె పేరు మాధురీదీక్షిత్‌’ అని చెప్పారు.’’

‘‘ఆ సమయంలో మాధురీ దీక్షిత్‌ చిరునామా కనుక్కోవడం కొంచెం కష్టమైంది. ఎలాగొలా కనుక్కొని వెళ్లి, ఆమె పీఏని కలిశాం. అతనికి విషయం చెబితే, ‘మా హీరోయిన్‌ డైలాగ్‌లు లేని అలాంటి సినిమాలు చేయదు’ అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వాళ్లు నాకు సన్మానం చేస్తే, ఆ కార్యక్రమానికి అమల వచ్చారు. వివరాలు అడిగితే, ‘అంతకుముందు శివాజీ గణేశన్‌‌తో ఒక సినిమా చేసింది. నటించడం సరిగా రాదు’ అని చెప్పారు. ఆమె ఫేస్‌ చూస్తే నాకు అలా అనిపించలేదు. నేచురల్‌గా అనిపించింది. అందుకే ‘పుష్పకవిమానం’లో తీసుకున్నా’ అంటూ ఆ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం సాగించిన వేటను చెప్పుకొచ్చారు సింగీతం. అయితే, మాధురీ దీక్షిత్‌తో మరో సినిమా చేస్తున్న సందర్భంలో ఈ విషయం చెబితే ఆమె తల బాదుకుంటూ ‘ఎవడు వాడు.. మంచి ఛాన్స్‌ పోగొట్టాడు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయిందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని