హీరోలు ఇక్కడివాళ్లే కానీ కెప్టెన్స్‌ అక్కడివాళ్లు

తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో అద్భుతాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల కాలంలో రాజమౌళి సృష్టించిన యాక్షన్‌ అడ్వంచర్‌ ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ ఖ్యాతి దశదిశలకు వ్యాప్తి చెందింది. దీంతో తెలుగు...

Published : 18 Feb 2021 15:36 IST

టాలీవుడ్‌పై కన్నేసిన ప్రముఖులు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో అద్భుతాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల కాలంలో రాజమౌళి సృష్టించిన యాక్షన్‌ అడ్వంచర్‌ ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ ఖ్యాతి దశదిశలకు వ్యాప్తి చెందింది. దీంతో తెలుగు కథానాయకులతో సినిమాలు చేసేందుకు ఇతర భాషా పరిశ్రమలకు చెందిన దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇప్పటికే ఓంరౌత్‌తోపాటు ప్రశాంత్‌నీల్‌తో భారీ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేయగా.. రామ్‌చరణ్ సైతం తమిళ దర్శకుడితో సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలా, తెలుగు హీరోలతో సినిమాలు ఓకే చేసిన వేరే భాషా దర్శకులు ఎవరు? అవి ఎప్పుడు పట్టాలెక్కనున్నాయి? ఓ సారి మీరు చూసేయండి..!

హీరోయిజానికి కేరాఫ్‌..

కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం హిట్‌ కావాలంటే పవర్‌ఫుల్‌ కథతోపాటు దానికి తగ్గట్టు హీరోయిజాన్నీ చూపించాలి. సన్నివేశం ఏదైనా సరే దానికి అనుగుణంగా హీరోని హైప్‌ చేసి చూపించడం కన్నడ చిత్రదర్శకుడు ప్రశాంత్‌నీల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్‌’ చిత్రమే దానికి ఉదాహరణ. ఇప్పుడు ఆయన ప్రభాస్‌తో కలిసి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సలార్‌’. ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్‌ ఇటీవల సింగరేణి బొగ్గుగనుల్లో ప్రారంభమైంది. ఇందులో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పాన్‌ ఇండియా మూవీగా ఇది విడుదల కానుంది.


20 ఏళ్ల తర్వాత వస్తోన్న మెగా డైరెక్టర్‌

మెగాస్టార్‌ చిరంజీవి మదిదోచిన మలయాళీ సూపర్‌హిట్‌ ‘లూసిఫర్‌‌’. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని తెలుగులోకి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను కుటుంబకథా చిత్రాలతో దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న మోహన్‌రాజా రూపొందించనున్నారు. ‘హనుమాన్‌ జంక్షన్‌’ తర్వాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రం ‘లూసిఫర్‌’ రీమేక్‌. దాదాపు 20 ఏళ్ల తర్వాత మోహన్‌రాజా చేస్తున్న తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


భారీ బడ్జెట్‌ డైరెక్టర్‌..

దక్షిణాదిలో పేరు పొందిన దర్శకుల్లో ఒకరు శంకర్‌. ఆయన సినిమా అంటే బడ్జెట్‌ వేరే స్థాయిలో ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఆయన చిత్రాలు తెరకెక్కిస్తారు. అందుకు నిదర్శనమే ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాలు. తాజాగా ఆయన టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. చరణ్‌ 15వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో పాన్‌ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌తోపాటు ‘ఆచార్య’ యాక్షన్‌ సీన్స్ షూట్‌లో బిజీగా ఉన్నారు. అలాగే శంకర్‌ సైతం ‘భారతీయుడు-2’ పూర్తి చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి కాగానే వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కనుంది.


‘ఆదిపురుష్‌’కు రంగం సిద్ధం

ప్రభాస్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ కాంబోలో పట్టాలెక్కనున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. పాన్‌ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు. కృతిసనన్‌ సీత పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముంబయిలో వేడుకగా జరిగాయి. ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్‌ త్వరలోనే ‘ఆదిపురుష్‌’ షూట్‌లో పాలుపంచుకోనున్నారు.


ఆయన మనకు సుపరిచితులే..

‘పందెం కోడి’, ‘పందెంకోడి-2’ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి. త్వరలో ఆయన ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌తో కలిసి పనిచేయనున్నారు. లింగుస్వామితో కలిసి తన కొత్త ప్రాజెక్ట్‌ ఓకే చేసినట్లు నటుడు రామ్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శ్రీనివాసా చిత్తూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘రెడ్‌’ విజయం తర్వాత ఇటీవల రామ్‌ కొంత బ్రేక్‌ తీసుకుని శివదీక్ష తీసుకున్న విషయం తెలిసిందే.


వీరే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు సైతం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సందీప్‌రెడ్డి వంగా ‘కబీర్‌సింగ్‌’తో విజయాన్ని సొంతం చేసుకోగా.. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తన లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని