లేడీ విజయసేతుపతిలా ఉండాలనుకుంటున్నా!

‘మెంటల్‌ మదిలో’ అంటూ తన అందం, నటనతో ఆకట్టుకుని, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటి నివేతా పేతురాజు. గతేడాది

Updated : 04 Jan 2021 20:31 IST

‘మెంటల్‌ మదిలో’ అంటూ తన అందం, నటనతో ఆకట్టుకుని, తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న నటి నివేతా పేతురాజ్‌. గతేడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అలరించిన నివేతా త్వరలో రామ్‌ ‘రెడ్‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె విలేకరులతో ముచ్చటించింది.

సంక్రాంతికి వస్తున్న మీ ‘రెడ్‌’ చిత్రం గురించి?

నివేతా పేతురాజ్‌: సంక్రాంతి పండగ మనమంతా చాలా బాగా జరుపుకొంటాం. అందులోనూ కరోనాతో ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మొదట మా చిత్రం గతేడాది డిసెంబరు 25న విడుదలవుతుందన్నారు. కానీ, సంక్రాంతికి వస్తుండడంతో మరింత సంతోషంగా ఉంది.

రెడ్‌తో మీ జర్నీ ఎలా ఉంది?

నివేతా పేతురాజ్‌: డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమలతో అంతకుముందు ‘చిత్రలహరి’కి పనిచేశాను. తమిళ్‌ మూవీ ‘తడమ్‌’రీమేక్‌ చేయనున్నట్టు ఆయన చెప్పగానే నేను ఓకే చెప్పేశాను. ఒక కొత్త ఫీలింగ్‌ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు నేను ‘తడమ్‌’ సినిమా చూడలేదు. కేవలం కొన్ని సీన్లు మాత్రమే రీమేక్‌ కోసం చూడాల్సి వచ్చింది.

పోలీస్‌ పాత్రకు ఎలా సిద్ధమయ్యారు?

నివేతా పేతురాజ్‌: దర్శకులు కిషోర్‌ తిరుమలనే ఆ పోలీస్‌ పాత్రకు తగ్గట్టు నన్ను సిద్ధం చేశారు. ఆయనతో ఉన్న సౌలభ్యం అదే. ఆయనకు స్క్రిప్ట్‌పై పూర్తి అవగాహన ఉంటుంది. నటుల నుంచి కావల్సిన నటనను ఆయన రప్పించుకుంటారు.

మీ పాత్ర ‘రెడ్‌’లో ఎలా ఉండబోతోంది?

నివేతా పేతురాజ్‌: అంతకు ముందు మా కాంబినేషన్లో చేసిన ‘చిత్రలహరి’లో నా పాత్ర కొంచెం మూడీగా ఉంటుంది. కానీ, ఇందులో  కొంచెం అమాయకత్వంతో కూడిన  పోలీస్‌ పాత్ర నాది. బయటకు ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం భయంగా నా క్యారెక్టర్‌ ప్రవర్తిస్తుంది.

రెండోసారి కిషోర్‌ తిరుమలతో పనిచేయడం ఎలా ఉంది?

నివేతా పేతురాజ్‌: కిషోర్‌ సార్‌తో చేసినపుడు నేను స్క్రిప్ట్‌ కూడా మొత్తం వినను. అంత నమ్మకం ఆయనంటే. అలాగే ‘బ్రోచేవారెవరురా’ చిత్ర దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కథ చెప్పినా నేను మొత్తం వినను. వెంటనే ఓకే చెప్పేస్తాను. వాళ్లిద్దరిపై నాకు పూర్తి నమ్మకం ఉంది.

రామ్‌ సెట్‌లో ఎలా ఉంటారు?

నివేతా పేతురాజ్‌: ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. మంచి హాస్యచతురత కలిగిన వ్యక్తి. తమిళ్‌ కూడా బాగా మాట్లాడతారు.

మీ పాత్రకు మీరే డబ్బింగ్‌ చెప్పారా?

నివేతా పేతురాజ్‌: అవును. ఇప్పుడే తెలుగు బాగా వస్తోంది. అలవైకుంఠపురంలో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నప్పటికీ, ఈ చిత్రంలోనే ఫుల్‌లెంగ్త్‌లో డబ్బింగ్‌ చెప్పాను. కొంచెం కష్టంగా అనిపించినప్పటికి ఎంజాయ్‌ చేశాను.

సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలే వేస్తున్నారు?

నివేతా పేతురాజ్‌: అలా ఏం కాదు. పాత్ర ప్రాముఖ్యతను బట్టి అవి ఎంచుకుంటున్నాను. ‘అల వైకుంఠపురంలో’ నా పాత్ర ప్రాధాన్యం అంతగా లేకపోయినప్పటికి, ఆ చిత్రం అందరికీ రీచ్‌ అవ్వడం నాకు ప్లస్‌ అయ్యింది.

ఇంకా రాబోతున్న మీ చిత్రాలు?

నివేతా పేతురాజ్‌: ‘పాగల్’‌, ‘విరాటపర్వం’తో పాటు చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న చిత్రం మరో 3 రోజుల షూటింగ్‌ ఉంది. కార్తికేయ-2 చిత్రానికి కూడా నన్ను సంప్రదించారు. ఇంకా స్క్రిప్ట్‌ వినలేదు. గ్లామర్‌ పాత్రలు చేయడానికైనా రెడీ. కానీ, కథ డిమాండ్‌ చేయాలి.

మీరు స్క్రిప్ట్‌లు ఎంచుకునే విధానం ఎలా ఉంటుంది?

నివేతా పేతురాజ్‌: కెరీర్‌ ప్రారంభంలో విన్న ప్రతి స్క్రిప్ట్‌కు ఓకే చెప్పేసేదాన్ని. మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా వంటి సినిమాల్లో నా పాత్ర చూసుకున్నాక, నా స్క్రిప్ట్‌ ఎంపిక విధానం మారిపోయింది. బలమైన ముద్ర వేసే పాత్రలు మాత్రమే ఇకపై ఎంచుకుంటాను.

తెలుగులో బ్యాక్‌ టు బ్యాక్‌ అవకాశాలు రావడంపై?

నివేతా పేతురాజ్‌: ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతురాలిని. మంచి స్క్రిప్ట్లు రావడం వల్లే త్వరగా ఇక్కడ సక్సెస్‌ అందుకోగలిగాను. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు.

రెడ్‌ సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది?

నివేతా పేతురాజ్‌: కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కొడుతుంది. ఏదైనా సినిమా షూటింగ్‌ మొదలుపెట్టిన మూడు రోజుల్లోనే మనకు ఫలితం ఎలా ఉండబోతుందో అర్థమౌతుంది. షూటింగ్‌ చేసినన్ని రోజులు సెట్‌లో పాజిటివ్‌ వైబ్స్‌ కనిపించాయి. రామ్‌ నటనైతే ఈ సినిమాలో అత్యద్భుతం.

ఇకపై ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలనుంటున్నారు?

నివేతా పేతురాజ్‌: కేవలం హీరోయిన్‌ పాత్రలే చెయ్యాలని లేదు. నేను లేడీ విజయసేతుపతిలా ఉండాలనుకుంటున్నాను. ఆయన హీరో, విలన్‌, తండ్రి, అన్న వంటి అన్ని పాత్రలు చేస్తారు. నాక్కూడా అలా చేయాలనుంది.

ఇదీ చదవండి..

అందరినీ మెప్పించేలా ‘రెడ్‌’


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని