సాయికుమార్‌ని బాలయ్య ఎంతో గౌరవించారు

తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో  జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సాయి కుమార్‌ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

Published : 09 Mar 2021 21:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో  జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సాయి కుమార్‌ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

‘‘సాయి కుమార్‌ గురించి ఎప్పుడో చెప్పాలి.. ఎవరెవరిని మర్చిపోతున్నానా అని వెతుక్కుంటుంటే ‘అన్నయ్యా మళ్లీ వావ్‌ కార్యక్రమానికి వస్తావా’ అని సాయి ఫోన్‌ చేశాడు. అయ్యో! ఇంకా సాయి గురించి చెప్పలేదు కదా అనుకున్నా. సాయి కంటే ముందే అతని తల్లిదండ్రులు మాకు ఆత్మీయులు. వాళ్లమ్మ కృష్ణజ్యోతి గారు నాకు సోదరి సమానం. మా పరుచూరి బ్రదర్స్‌కి రక్తం సంబంధం లేని ఆత్మీయ బంధుత్వం ఉంది సాయి కుమార్‌ కుటుంబంతోనే. ఎందుకంటే వాళ్ల కుటుంబంలోని నటులందరితోనూ పనిచేశాం. తొలినాళ్లలో మేము రాసిన  ముఫ్పై నలభై చిత్రాలు సాయి చేశాడు. అసలు సాయి లేకుండా సినిమా ఉండేది కాదనొచ్చు. అప్పట్లో రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, సాయి, రాజావర్మ  ఓ బృందంలా  ఉండేవారు. అందరికీ వేషాలు దొరికేలా కథలు రాసేవాళ్లం. అలా ఎక్కువగా రాసింది సాయికే. ‘కర్తవ్యం’ చిత్రంలో విజయశాంతి తమ్ముడి పాత్రలో అద్భుతంగా నటించాడు. ‘డాక్టర్‌ భవాని’లోనూ అదరగొట్టాడు. శారద సినిమాల్లో చాలా వాటిలో సాయి కుమార్‌ ఉన్నాడు. ముఖ్యంగా ‘మదర్‌ ఇండియా’లో విశ్వరూపం చూపించాడు. 1985లో ఓసారి రాఘవేంద్రరావు గారు అకస్మాత్తుగా ఫోన్‌ చేసి షూటింగ్‌ దగ్గరకు రండి అన్నారు. ఏంటా అని వెళ్తే.. పెళ్లి కొడుకు వేషంలో సాయిని కూర్చోబెట్టారు. ‘ఇదెవరు చెప్పారండి? మేం చెప్పలేదు కదా’ అంటే.. ‘అయ్యో మేకప్‌ వేసేశారు, అంతగొప్ప నటుడుకి రెండు డైలాగులైనా రాయండి’అంటే అక్కడిక్కడే రాశాం. సూపర్‌ స్టార్‌ కృష్ణగారు వచ్చి పెళ్లి చెడగొట్టే సన్నివేశంలో వస్తుంది. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’లో విలన్‌గా చేశాడు.

‘సర్పయాగం’ అయితే మామూలుగా ఉండదు. హీరో శోభన్‌ బాబుకి సాయం చేసే పాత్ర ఇది. సాయి వేయాల్సిన వేషం నేను వేద్దామనుకున్నా. ‘అసలే రామానాయుడు గారు ఏకాగ్రతతో సినిమా తీయాలి. నువ్వు పెద్ద వేషంలో ఇరుక్కుపోతే ప్రతిసారి ఆ కెమెరా దగ్గర ఎవరో కూర్చుంటారు’ అని అన్నయ్య చెప్పడంతో చేయలేదు. అదే సినిమాలోని పాటలో ఓ చిన్న వేషం వేశాను. ‘మేజర్‌ చంద్రకాంత్‌’లోనూ అద్భుతమైన వేషం వేశాడు. నెగెటివ్ పాత్రలు‌, పాజిటివ్‌ పాత్రలు ఏదొస్తే అది చేసుకుంటూ వెళ్లేవాడు.  1996లో వచ్చిన ‘పోలీసు స్టోరీ’లో కనిపించే మూడు సింహాలు సంభాషణతో అతని ఇమేజ్‌ మారిపోయింది. ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా అతని జీవితం ప్రారంభమైంది. నటుడైనా కూడా డబ్బింగ్‌ కళని వదలుకోలేదు. వ్యాఖ్యాతగానూ అలరిస్తున్నాడు. ‘సీమసింహం’లో బాలకృష్ణకి సరిపోతాడు అనుకుని విలన్‌గా ఓకే చేశా. బాలయ్య బాబు కూడా ఎంతో గౌరవించాడు సాయి కుమార్‌ని. గురువు గారు అతను ఓ పక్క హీరో ఇందులో విలన్‌గా చేస్తున్నాడంటూ పోరాట సన్నివేశాల్లో సాయి స్థాయిని ఎక్కడా తగ్గకుండా చూసుకున్నాడు.  కానీ, సాయి పాజిటివ్‌ ఇమేజ్‌ దెబ్బతీసింది. లేదంటే సీమసింహం మంచి సినిమా. సాయి ఇప్పటికీ 35 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మాకు అలాగే కనిపించాలి. అతని కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని