Project K: విడుదలకు ముందే రికార్డు సృష్టించిన ‘ప్రాజెక్ట్‌-కె’.. బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌

‘ప్రాజెక్ట్‌ -కె’ (Project K) గురించి మేకర్స్‌ ఓ అద్భుతమైన విషయం చెప్పారు. అంతర్జాతీయ వేదికపై దీని వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

Updated : 07 Jul 2023 10:40 IST

హైదరాబాద్‌: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరో ప్రభాస్‌ నటిస్తోన్న సినిమా ‘ప్రాజెక్ట్‌-కె’ (Project K). భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తూ చిత్రబృందం ఓ బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. ‘ప్రాజెక్ట్‌-కె’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో (Comic-Con) పాల్గొననున్నట్లు ప్రకటించింది. 

అమెరికాలో జరగనున్న శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్‌లో ‘ప్రాజెక్ట్‌-కె’ చిత్రబృందం పాల్గొననుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా ‘ప్రాజెక్ట్‌-కె’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌ గొప్ప కథలకు, సినిమాలకు నిలయం. మా చిత్రంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ ప్రేక్షకులకు ‘ప్రాజెక్ట్‌-కె’ కథను పరిచయం చేయడానికి శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్‌ సరైన వేదిక అని మేమంతా భావిస్తున్నాం’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

జులై 20 నుంచి 23 వరకు జరగనున్న ఈ ఈవెంట్‌లో తొలిరోజు ‘ప్రాజెక్ట్‌-కె’ చిత్రబృందమంతా పాల్గొననుంది. దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌ దీనికి హాజరుకానున్నారు. ఇక అదే వేదికపై ఈ సినిమా టైటిల్‌, ట్రైలర్‌, రిలీజ్‌ డేట్‌ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా వీక్షకులు వస్తారు. అక్కడ ఈ సినిమా వివరాలు ప్రకటించడం నిజంగా గర్వకారణం అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రభాస్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే దీని మేకింగ్‌ వీడియోస్‌ సోషల్‌ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని