Samantha: జీవితం అంతకు ముందులా లేదు: సామ్‌

అభిమానులు చూపించే ప్రేమాభిమానాల వల్లే తాను ధైర్యంగా ఉన్నానని తెలిపారు అగ్రకథానాయిక సమంత. ‘శాకుంతలం’ అప్‌డేట్‌ తర్వాత ఆమె అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

Published : 02 Jan 2023 16:20 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం తన జీవితం విభిన్నంగా ఉందని, అంతకు ముందులా లేదని అన్నారు అగ్రకథానాయిక సమంత (Samantha). అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు, తన కోసం వాళ్లు చేసే ప్రార్థనల వల్లే తాను ధైర్యంగా ఉన్నానని చెప్పారు. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘‘మేడమ్‌ మీ జీవితం ఎలా సాగుతోంది’’ అని ప్రశ్నించగా.. ‘‘విభిన్నంగా ఉంది’’ అని సామ్‌ బదులిచ్చారు.

అనంతరం మరో నెటిజన్ ‘‘మేడమ్‌ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజూ కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్‌ సక్సెస్‌లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి’’ అని కోరగా.. ‘‘మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు’’ అంటూ సరదాగా బదులిచ్చారు. ‘‘మీరు శాకుంతలం ప్రాజెక్ట్ అంగీకరించడానికి కారణం ఏమిటి?’’ అని వేరొక నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘‘త్వరలో మీరే చూస్తారు కదా’’ అని ఆమె చెప్పారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.

మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రాన్ని రూపొందించారు. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. గుణశేఖర్‌ దర్శకుడు. గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో సామ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని