వెంకటేశ్‌ ‘శత్రువు’కు 30ఏళ్లు

విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో హిట్టు సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు చర్చకు క్యూకడతాయి. అయితే.. అందులో ఆడుతుందో లేదో.. అనే అనుమానాలతో మొదలై అదిరిపోయే హిట్టు కొట్టిన సినిమాలూ ఉన్నాయి. ఈ అలాంటి సినిమాల్లో  ‘శత్రువు’ అగ్రస్థానంలో ఉంటుంది

Updated : 30 Nov 2021 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విక్టరీ వెంకటేశ్‌ కెరీర్‌లో హిట్‌ సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు చర్చకు క్యూకడతాయి. అందులో ఆడుతుందో లేదోనన్న అనుమానాలతో మొదలై అదిరిపోయే హిట్టు కొట్టిన సినిమాలూ ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ‘శత్రువు’ అగ్రస్థానంలో ఉంటుంది. ఈతరం వాళ్లకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ముప్పయ్యేళ్ల క్రితం నాటి సినీ ప్రేక్షకులకు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన విజయశాంతి ఆడిపాడింది. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజుకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం. వేటూరి, సీతారామశాస్త్రి రాసిన పాటలు.. రాజ్-కోటి వినసొంపైన సంగీతం.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటితో 30 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం..

సినిమా కథేంటంటే..

నిజాయతీగా ఉండే న్యాయవాది దుర్గాప్రసాద్‌ (విజయ్‌కుమార్‌) రౌడీల చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. దుర్గాప్రసాద్‌ దగ్గర అశోక్‌ (వెంకటేశ్‌) న్యాయవాదిగా పనిచేస్తుంటాడు. తనను చేరదీసి ప్రయోజకుడిగా తయారు చేసిన న్యాయవాదిని దారుణంగా హతమార్చిన వాళ్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు అశోక్‌. శత్రువును దెబ్బతీస్తూ వెళుతుంటాడు. ఈ క్రమంలో చట్టాన్ని విశ్వసించే ఏసీపీ విజయ (విజయశాంతి) కథానాయకుడికి అడ్డుపడుతూ ఉంటుంది. మొత్తానికి హీరో.. విలన్‌ వెంకటర్నతం (కోట శ్రీనివాసరావు)పై విజయం సాధిస్తాడు. ఆఖరికి చట్టం ముందు లొంగిపోతాడు. ఇదే సినిమా కథ. డైరెక్టర్‌ కోడి రామకృష్ణ ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ప్రతినాయకుడిగా కోట శ్రీనివాసరావు సినిమాను తారస్థాయికి తీసుకెళ్లారు. బ్రహ్మానందం, నగేశ్‌ తనదైన కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించారు.

 

అలా బీజం

నిర్మాత ఎం.ఎస్‌.రాజు తండ్రి రాయపరాజు కూడా పలు సినిమాలను నిర్మించారు. తండ్రిలాగే తాను కూడా నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎం.ఎస్‌.రాజు ఆలోచిస్తుండేవారు. అప్పటి నుంచి విపరీతంగా సినిమాలు చూడటం మొదలుపెట్టారు. సినిమాలపై మంచి పరిజ్ఞానం వచ్చిన తర్వాత దర్శకుడు కోడి రామకృష్ణను కలిసి సినిమా చేయాలన్న ఆలోచనను వ్యక్తపరిచారు. అలా ‘శత్రువు’ సినిమాకు బీజం పడింది. అప్పటి వరకూ కేవలం హాలీవుడ్‌కే పరిమితమైన స్క్రీన్‌ప్లే అనే పదం ఈ సినిమాతోనే తెలుగు సినిమాకు దగ్గరైంది. వీటికి తోడు ‘బొబ్బిలి రాజా’ వెంకటేశ్‌, ‘కర్తవ్యం’తో విజయశాంతి భారీ విజయాలు అందుకొని అప్పటికే తెలుగు సినిమా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇంకేముంది సినిమా విడుదలవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. సినిమా భారీ విజయం సాధించింది. 150 రోజుల పాటు థియేటర్‌లలో అలరించిన ఈ చిత్రం వెంకటేశ్‌ కెరీర్‌లో ఓ కీలక మైలురాయిగా నిలిచింది.

 

ఇదీ చదవండి..

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని