Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్‌

‘టక్కర్‌’ (Takkar) ప్రమోషన్‌లో పాల్గొన్న సిద్ధార్థ్‌ (Siddharth) ఒకావిడను చూసి భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Published : 09 Jun 2023 01:43 IST

హైదరాబాద్‌: చిత్రపరిశ్రమలో అనుకోకుండా హీరో అయిన వాళ్లు కొందరైతే.. ఎంతో కష్టపడి హీరోగా ఎదిగిన వాళ్లు మరికొందరు. ఇక తెలిసిన వారి ప్రోత్సాహంతో సక్సెస్‌ అయిన వాళ్లు ఇంకొందరు. దర్శకుడు కావాలనుకున్న సిద్ధార్థ్‌ (Siddharth) ఒకరి వల్ల హీరోగా ఎదిగి స్టార్‌ అయ్యాడు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ హీరోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సుజాత రంగరాజన్‌ (sujatha rangarajan).. ఈవిడే లేకపోతే సిద్ధార్థ్‌ హీరో అయ్యేవాడు కాదు. తనకు సినీ జీవితాన్నిచ్చిన ఆమెను చూసి ఓ ఇంటర్వ్యూలో అతడు ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో ‘టక్కర్‌’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ సుజాత రంగరాజన్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఆమెను చూసిన వెంటనే సిద్ధార్థ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించి.. ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. ‘ఈవిడ పేరు సుజాత. నన్ను బాయ్స్‌ సినిమాలో హీరోగా తీసుకోవాలని దర్శకుడు శంకర్‌ను కోరకపోతే.. నా జీవితం ఈరోజు వేరేలా ఉండేది. ఈమె వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను’’ అని చెప్పాడు.

ఇక సుజాత రంగరాజన్‌ మాట్లాడుతూ..‘‘సిద్ధార్థ్‌ మొదటి నుంచి దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ‘బాయ్స్‌’ సినిమాలో హీరో కోసం ఆడిషన్స్‌ జరుగుతుంటే నేను సిద్ధార్థ్‌ను తీసుకోవాల్సిందిగా దర్శకుడు శంకర్‌ని కోరాను. సిద్ధార్థ్ వెళ్లడానికి అంగీకరించలేదు. నేనే బలవంతంగా ఒప్పించి పంపా. శంకర్‌ ఫోన్‌ చేసి ఒకసారి వచ్చి ఫొటో షూట్‌ చేసి వెళ్లమనడంతో.. ఇష్టం లేకుండానే వెళ్లాడు. వాళ్లు తనని చూసిన వెంటనే ఆ సినిమాలో హీరోగా ఓకే చేశారు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా ఈ హీరోను ప్రశంసిస్తున్నారు. ‘ఆమె చేసిన మేలు గుర్తుంచుకున్నావు. రియల్‌ హీరోవి’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

సిద్ధార్థ్‌ నటించిన ‘టక్కర్‌’ (Takkar) జూన్‌9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్‌ జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ సరసన దివ్యాంశ కౌశిక్‌ నటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని