Thalapathy Vijay: రూ.కోటి విరాళం ఇచ్చిన నటుడు విజయ్‌.. ఎందుకంటే?

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay) రూ.కోటి విరాళం అందించారు.

Published : 13 Mar 2024 00:50 IST

చెన్నై: తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌ (Vijay) రూ.కోటి విరాళం అందించారు. ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (South Indian Artistes Association) భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు సినీ నటుడు విశాల్‌ (Vishal) తెలిపారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతూ ‘ఎక్స్‌’ వేదికగా విజయ్‌తో దిగిన ఫొటోను విశాల్‌ పంచుకున్నారు.

‘థ్యాంక్యూ అన్నది కేవలం రెండు పదాలే కావొచ్చు. కానీ, హృదయం లోపలి నుంచి వచ్చే ఆ మాటకు విశాలమైన భావన ఉంటుంది. నా అభిమాన నటుడు, నాకు అత్యంత ఆప్తుడైన దళపతి విజయ్‌ రూ.కోటి విరాళం ఇచ్చారు. నడిగర్‌ సంఘం భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఆయనకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీ అందరికీ తెలుసు.. మీ సహకారం, ప్రమేయం లేకుండా భవన నిర్మాణం పూర్తి కాదు. త్వరలోనే అది సాకారం కాబోతోంది. విజయ్‌ నిర్ణయం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని విశాల్‌ ట్వీట్ చేశారు.

విజయ్‌ ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తామని ప్రకటించారు. ప్రస్తుతం విజయ్‌ పార్టీకి సంబంధించిన గుర్తు, కార్యచరణ, విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు వీలైనంత త్వరగా ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని