Acharya: చిరంజీవి ‘ఆచార్య’ ఆసక్తికర పది విషయాలు మీకు తెలుసా?

చిరంజీవి(Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’(Acharya).

Updated : 26 Apr 2022 17:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’ (Acharya). రామ్‌చరణ్‌ (Ram charan) కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా మొదలైన దగ్గరి నుంచి విడుదల వరకూ పది ఆసక్తికర విషయాలు మీకోసం...

  1. అక్టోబరు 8, 2019 విజయదశమి రోజు ‘చిరు 152’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్నారు. కరోనా కారణంగా మధ్యలో సినిమా ఆగిపోయింది. సినిమా మొదలైన రోజు నుంచి విడుదలవడానికి రెండు సంవత్సరాల ఆరునెలల సమయం పట్టింది.
  2. నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన చిరంజీవి(Chiranjeevi)-రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న పూర్తిస్థాయి చిత్రమిది. చిరు-నాగబాబుల తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు నటులు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. ఇందులో చిరంజీవి నక్సలైట్‌ నాయకుడిగా కనిపించనున్నారు. గతంలో ‘రక్త సింధూరం’(1985)లో చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించారు.
  3. ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ అతిథి పాత్ర పోషిస్తున్నారు.  గతంలో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ సాంగ్‌లో చరణ్‌ మెరిసిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు చరణ్‌ నటించిన ‘మగధీర’, ‘బ్రూస్లీ’ చిత్రాల్లో చిరు తళుక్కున మెరిశారు.
  4. చిరంజీవి(Chiranjeevi)తో సినిమా చేయాలని కొరటాల శివ అనుకోలేదట.  తొలుత రామ్‌చరణ్‌తో సినిమా చేద్దామనుకున్నారు కొరటాల. కథను కూడా వినిపించారు. అయితే ‘ఆర్‌ఆర్ఆర్‌’ కారణంగా ఆ సినిమా ఆలస్యమవడంతో చిరంజీవి కోరిక మేరకు ఈ సబ్జెక్ట్‌ సిద్ధం చేశారు. ఆ తర్వాత అనుకోకుండా సిద్ధ పాత్ర కోసం రామ్‌చరణ్‌ సినిమాలో భాగమయ్యారు.
  5. ‘ఆచార్య’ టైటిల్‌ను కూడా చిరంజీవే (Chiranjeevi)పొరపాటున లీక్‌ చేశారు.  మార్చి 2020 ‘ఓ పిట్ట కథ’ ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయన కొరటాలతో చేస్తున్న సినిమా పేరు ‘ఆచార్య’అని చెప్పేశారు.
  6. తొలుత ఈ సినిమాలో కథానాయికగా త్రిషను అనుకున్నారు. ఆమె కూడా సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాజల్‌ను కథానాయికగా తీసుకున్నారు. కొన్ని రోజులు షూట్‌ కూడా చేశారు. చివరకు కథ, ‘ఆచార్య’ పాత్ర ఔచిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సన్నివేశాలను తొలగించారు.
  7. ‘ఆచార్య’సినిమా అత్యధిక భాగం ధర్మస్థలి ప్రాంతంలో జరుగుతుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని చిరంజీవి(Chiranjeevi)కి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలల పాటు శ్రమించి ‘ధర్మస్థలి’ సెట్‌ వేశారు.
  8. స్టార్‌ హీరో మహేశ్‌బాబు ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన ‘జల్సా’ సినిమాకు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అందులో కూడా పవన్‌కల్యాణ్‌ నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తారు.
  9. ‘ఆచార్య’ సినిమా నిడివి 154 నిమిషాలు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.  సంగీత ఓ స్పెషల్‌ సాంగ్‌లో, రెజీనా ఐటమ్‌ సాంగ్‌లో తళుక్కున మెరవనున్నారు.
  10. తొలుత ఈ సినిమాను మే 13, 2021 విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతి రేసులోకి వచ్చినా, మరోసారి కరోనాతో విడుదల కాలేదు. మళ్లీ ఫిబ్రవరి 4, లేదా ఏప్రిల్‌ 1 2022న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. చివరకు ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని