Mahesh Babu: మహేశ్‌-రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే..

రాజమౌళి - మహేశ్‌ (Mahesh Babu) కాంబోలో ఒక చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గురించి విజయేంద్ర ప్రసాద్‌ ఒక ఆసక్తికర విషయం చెప్పారు.  

Published : 18 May 2023 16:12 IST

హైదరాబాద్‌: స్టార్‌ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేశ్‌ బాబు (Mahesh Babu) ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) కథను అందిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ను తెలిపారు.

ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో చెప్పారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. గతంలో ఈ చిత్రం గురించి మహేశ్‌ బాబు మాట్లాడుతూ..‘‘ఈ సినిమాతో నా కల నిజం కానుంది. రాజమౌళితో కలిసి ఒక చిత్రం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మేమిద్దరం దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఇప్పటికి ఓకే అయింది. ఇందులో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఇక షూటింగ్‌ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగనుంది. మహేశ్‌ ఇంటెన్సిటీ ఉన్న నటుడని.. ఇది ఎంతో సాహసోపేతమైన కథ అని విజయేంద్ర ప్రసాద్‌ గతంలో అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాతో మహేశ్‌ బాబు బిజీగా ఉన్నాడు. SSMB28 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.  వచ్చే ఏడాది జనవరిలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజమౌళి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని