ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం

పేద విద్యార్థుల చ‌దువు మధ్యలో ఆగిపోకూడ‌ద‌ని, వారి కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యమని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త అన్నారు.

Published : 11 Dec 2023 23:57 IST

న్యూజెర్సీ: పేద విద్యార్థుల చ‌దువు మధ్యలో ఆగిపోకూడ‌ద‌ని, వారి కలలను సాకారం చేసి సమాజ అభ్యున్నతికి తోడ్పాటును అందించడమే తమ లక్ష్యమని తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త అన్నారు. న్యూజెర్సీలోని రాయ‌ల్ అల్బర్ట్స్ ప్యాలెస్‌లో సంస్థ 15వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ వందలాది మంది పేద విద్యార్థుల చదువుకోసం తాము చేయూత అందించామని, ఇక ముందు కూడా కొన‌సాగిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ నిర్వాహకులు పలువురి నుంచి విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను పేద విద్యార్థుల చదువుకోసం వినియోగించనున్నట్లు తెలిపారు.

సుమారు వెయ్యి మంది హాజరైన కార్యక్రమంలో లక్షా మూడు వేల డాలర్ల విరాళాలు సేకరించామని ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త, ఫండ్ రైజింగ్ డైరక్టర్ ప్రవీణ్ గూడూరు, వార్షికోత్సవ కార్యక్రమ కన్వీనర్ బోయపాటి అరవింద బాబు తెలిపారు. అధ్యక్షులు కృష్ణ కొత్త సంస్థ కార్యక్రమాల గురించి వివరించారు. ‘‘ఈ ఏడాది 76 మందిని స్పాన్సర్ చేయగా, అందులో 13 మంది డాక్టర్లు కాబోతున్నారు. ఆసుపత్రి ముందు సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు  వైద్య విద్యార్థిగా ఉన్నాడు. ఒక గిరిజన విద్యార్థి లాయరు కాబోతున్నాడు. తమ సామాజిక వర్గంపై జరుగుతున్న అణచివేతను ఎదుర్కోవడమే తన ధ్యేయం. తలదించుకొని చదువుకొండి.. సమాజంలో రేపటి రోజున తలెత్తుకుని జీవించండి’’ అంటూ ఈ సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేశారు. తాము విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

తమ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్, కంప్యూటర్ అప్లికేషన్‌లో మాస్టర్స్, సీఏ వంటి ఉన్నత విద్యకు సహాయం చేస్తున్నామన్నారు. తాము ఇప్పటివరకు స్పాన్సర్ చేసిన 402 మంది విద్యార్థులలో 155 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. 30 మంది ఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీలు, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్నారని తెలిపారు. తాము ఆర్థికంగా, నైతికంగా ఇచ్చే మద్దతుతో విద్యార్థులు తమ చదువులో లక్ష్యాలు సాధిస్తున్నారని అధ్య‌క్షుడు వివరించారు. ప్రవాసుల నుంచి విరాళాలు సేకరించి భారత్‌లోని పేద విద్యార్థుల చదువు కోసం ఈ సంస్థ ఆర్థిక సాయం చేస్తోంది. తెలుగు పీపుల్ ఫౌండేషన్ ఇప్పటికే 402 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. 55 ప్రాజెక్టుల‌ను పూర్తి చేసింది. గడిచిన 15 ఏళ్లలో భారత్‌లోని పేద విద్యార్థులకు రూ. 3.5 కోట్లకుపైగా పంపిణీ చేసింది. 

ఈ వేడుక‌లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయనీగాయకులు సుమంగ‌ళి, సుంద‌రి ముల‌క‌లూరి, ప్ర‌సాద్ సింహాద్రి, అర్జున్ ఆడ‌ప‌ల్లి పాటలు పాడి విరాళాలకు సహకరించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ, అద్భుతమైన సేవ చేస్తున్న సంస్థను అభినందించారు. శ్రీ‌ల‌క్ష్మి కులకర్ణి యాంక‌రింగ్‌తో కార్య‌క్ర‌మాల‌ను ఆహ్లాదంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ, చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు ప్రజలు, తానా, నాటా, మాటా, నాట్స్, టీఫాస్, ఎన్‌జెటీఏ, ఆటా, టీటీఏ, ఎన్నారైవీఏ, ఆటీ తదితర తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరై సహకారం అందించారు. 

న్యూజెర్సీ అసెంబ్లీకి పలు పర్యాయాలు ఎన్నికైన ఉపేంద్ర చివుకుల, తెలుగు ప్రముఖులు దాము గేదెల, ప్రదీప్ సువర్ణ, రవి ధనపునేని, నాట్స్ ఛైర్‌పర్సన్‌ అరుణ గంటి, ఎన్జేటీఏ వ్యవస్థాపకురాలు మంజుభార్గవ, నాటా డైరెక్టర్ ఉషా చింతా, మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని, తానా నాయకులు రామకృష్ణ వాసిరెడ్డి, ఎన్నారైవీఏ నాయకులు వెంకట శ్రీరాం, టీటీఏ నుంచి సుధాకర్ ఉప్పల, ఆటా నుంచి కిశోర్ లింగమల్లు, కుమారరాజా సదరం తదితరులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని