సింగపూర్‌లో సంక్రాంతి శోభ

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో  ‘సింగపూర్ సంక్రాంతి శోభ’ కార్యక్రమం అంతర్జాల వేదికపై అలరించింది.

Published : 31 Jan 2024 22:55 IST

సింగపూర్‌: శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో  ‘సింగపూర్ సంక్రాంతి శోభ’ కార్యక్రమం ఆద్యంతం అంతర్జాల వేదికపై అలరించింది. సింగపూర్‌లో పెద్దలు పిల్లలు కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా విచ్చేసి సంస్థ కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి ప్రకృతి పండుగ. స్నేహ సంబంధాలు పెంచి ఆత్మీయతను పంచే పండుగ.  విదేశాల్లో ఈ తరం పిల్లలను కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం చేస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను తెలియజేసేలా వేడుకలు నిర్వహించడం ఆనందదాయకం. సింగపూర్‌లో సంస్కృతీ సంప్రదాయాలు పరిరక్షించే దిశగా ఈ సంస్థ మరిన్ని కార్యక్రమాలు చేయాలి’’ అని ఆకాంక్షించారు.

ఆత్మీయ అతిథులుగా భాజపా సీనియర్‌ నాయకులు,  సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్‌లో తెలుగు సంస్కృతి కోసం చేస్తున్న సేవలను అభినందించారు. సింగపూర్‌లో సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రతిభ కలిగినవారు ఉన్నారని వారందరినీ ఈ వేదిక నుంచి కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ కు చెందిన ‘స్వర లయ ఆర్ట్స్’ విద్యార్థులు ప్రదర్శించిన గొబ్బిళ్ళ పాటలు, సంప్రదాయబద్ధమైన ఆటలు, ముగ్గులు, భోగి పళ్లు, హరిదాసు వేషధారణ అందరినీ అలరించాయి. ‘‘సింగపూర్‌లో ఉండే తెలుగు ప్రజల్లో మంచి కళాసృజన, రసాత్మకత నిండి ఉన్నాయి. వారి ప్రతిభను ప్రోత్సహించేలా ఇలాంటి వేదికలు మరిన్ని ఏర్పాటు చేసే దిశగా మా సంస్థ కృషి చేస్తుంది. ఆ దిశగా దత్తాత్రేయ, ఇతర ఆత్మీయ అతిథులు అందించిన ఆశీస్సులు మరింత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి’’ అని శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అన్నారు. అతిథులకు, కళాకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాధిక మంగిపూడి సభానిర్వహణలో, విద్యాధరి కాపవరపు, సౌభాగ్య లక్ష్మీ తంగిరాల, షర్మిల చిత్రాడ, శేషు కుమారి యడవల్లి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, కృష్ణ కాంతి, తదితర గాయనిలు చక్కటి సంక్రాంతి పాటలను ఆలపించారు. అలాగే సింగపూర్ సాహితీ ప్రతిభను నిరూపిస్తూ అపర్ణ గాడేపల్లి, సుబ్బు వి పాలకుర్తి, ఫణీష్ ఆత్మూరి, స్వాతి జంగా, రోజా రమణి ఓరుగంటి, కవిత కుందుర్తి, శైలజ శశి ఇందుర్తి, శాంతి తెల్లదేవరపల్లి తదితరులు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరిస్తూ తెలుగు పద్యాలు, సంక్రాంతి కవితలు రచించి వినిపించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదులు, భాస్కర్ ఊలపల్లి, రాంబాబు పాతూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ఛానల్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని