NTR: లండన్‌లో వైభవంగా శకపురుషుని శతజయంతి వేడుకలు

 ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఎన్ఆర్‌ఐ తెదేపా యూకే ఆధ్వర్యంలో లండన్‌లో ఘనంగా నిర్వహించారు.

Published : 29 May 2023 23:29 IST

లండన్‌: ఎన్ఆర్‌ఐ తెదేపా యూకే బృందం సహకారంతో లండన్ నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు, మహానాడు ఘనంగా జరిగాయి. తెదేపా యూకే అధ్యక్షుడు వేణు మాధవ్ పోపూరి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ, 100 చదరపు అడుగుల కేక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లండన్‌లో సీనియర్‌ డాక్టర్లు జ్యోతిప్రజ్వలన చేసి ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 8 వరకు జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మందికి పైగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలకు సంబంధించిన వివరాలతో కూడిన ప్రెజెంటేషన్ ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి రత్నశ్రీ ఉప్పాల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఎన్టీఆర్‌ పాటలతో కూడిన Medley డాన్స్ యువతను ఉర్రూతలూగించింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆయన ఆలోచనల్ని నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన స్పూర్తితో నేటి తరం మరిన్ని విజయాల్ని అందుకునేలా ప్రజల్లో చైతన్యం నింపటం కోసం ఎన్‌ఆర్‌ఐ తెదేపా యూకే  చేపడుతున్న, చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికని ఈ సందర్భంగా వివరించారు. తెలుగుజాతి ప్రస్థానంపై చేసిన ప్రసంగాలు యువతను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతిథులకు తెలుగు రుచులతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పంజాబీ డోలే నృత్యాలు, బాణా సంచా వేడుకలు, శత జయంతికి సూచికగా 100 ఎన్టీఆర్‌ ఆకారంలో అభిమానులు చేసిన మానవహారం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని