ఆధునిక కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్ : కొప్పర్తి

ఆధునిక కవిత్వాన్నా మలుపుతిప్పిన కవి ఇస్మాయిల్‌ అని ప్రముఖ కవి కొప్పర్తి వెంకటరమణమూర్తి అన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్‌లో అక్టోబరు 9, 2022న నిర్వహించిన ‘వీక్షణం సాహితీ వేదిక’ 122 వ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Updated : 11 Oct 2022 23:41 IST

కాలిఫోర్నియా: ఆధునిక కవిత్వాన్నా మలుపుతిప్పిన కవి ఇస్మాయిల్‌ అని ప్రముఖ కవి కొప్పర్తి వెంకటరమణమూర్తి అన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్‌లో అక్టోబరు 9, 2022న నిర్వహించిన ‘వీక్షణం సాహితీ వేదిక’ 122 వ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘ఆధునిక కవిత్వ మార్గాలు- ఇస్మాయిల్ కవిత్వం’’ అనే అంశంపై ప్రసంగించారు. ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి వస్తు పరంగా వచ్చిన భేదాల్ని కొప్పర్తి తొలుత వివరించారు. తరువాత గురజాడ, శ్రీశ్రీ, ఇస్మాయిల్ కవిత్వాల్లో ఉన్న విశేషాంశాల్ని వివరిస్తూ శ్రీశ్రీ తరువాత ఆధునిక కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి ఇస్మాయిల్ అని కొనియాడారు.ఇస్మాయిల్ కవిత్వాన్ని స్వచ్ఛమైన నీటితో పోలుస్తూ.. దాహార్తికి నీరు ఎంత అవసరమో ఆధునిక కవులకు ఇస్మాయిల్ కవిత్వం అంత అవసరమన్నారు. ఇస్మాయిల్ కవిత్వంలో వాహకం, వాహిక రెండూ కవిత్వమేనని చెప్పారు. ‘‘తొలిసంధ్య నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు’’, ‘‘బుద్ధిగా ప్రేమించుకోక యుద్ధమెందుకు చేస్తారో నాకర్థం కాదు’’ ‘‘ఏ కాకీ ఎగరని ఏకాకి ఆకాశం’’ ‘‘తరుచాపము వీడిపోయి గురి మరచిన బాణంలా తిరుగుడును పిట్ట’’ అంటూ ఇస్మాయిల్ తన కవిత్వంలో అలవోకగా, సరళంగా, అనితరసాధ్యంగా రాసిన అనేక విశేషాంశాల్ని సోదాహరణంగా సభకు వివరించారు. 

కొప్పర్తి విశ్రాంత చరిత్ర ఉపన్యాసకులు. అయినప్పటికీ మొదట్నించీ కవిత్వం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. దాదాపు నలభై ఏళ్ల నించి కవిత్వం రాస్తున్నారు. పిట్టపాడే పాట, విషాదమోహనం, యాభైఏళ్ళవాన అనే మూడు కవితా సంపుటులు వెలువడ్డాయి. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియా లో ‘‘వీక్షణం’’ సాహితీ వేదిక గత పదేళ్లుగా నెలనెలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని చాటుతోంది. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొప్పర్తిని డా.కే.వి.రమణారావు సభకు పరిచయం చేశారు. ఈ సభలో స్థానిక ప్రముఖులు డా. అక్కిరాజు రమాపతిరావు, కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, డా.కె.గీత, సుభాష్ పెద్దు, వేణు ఆసూరి, డా.కే.వి.రమణారావు, శారద కాశీవఝల, శ్రీధర్ రెడ్డి , సుభద్ర ద్రోణంరాజు, మృత్యుంజయుడు తాటిపాముల మున్నగువారు అనేకులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని యూట్యూబులోనూ చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని