భారత్‌లో తగ్గనున్న ఐఫోన్ ధరలు..

యాపిల్ అభిమానులకు శుభవార్త. త్వరలో భారత మార్కెట్లో ఐఫోన్‌, ఐపాడ్, మ్యాక్‌  కంప్యూటర్ల ధరలు తగ్గనున్నాయి. భారత్‌లో తన ఉత్పత్తిని యాపిల్‌ పెంచనుండటమ.....

Published : 27 Jan 2021 23:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యాపిల్ అభిమానులకు శుభవార్త. త్వరలో భారత మార్కెట్లో ఐఫోన్‌, ఐపాడ్, మ్యాక్‌  కంప్యూటర్ల ధరలు తగ్గనున్నాయి. భారత్‌లో తన ఉత్పత్తిని యాపిల్‌ పెంచనుండటమే ఇందుకు కారణమట. ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో కొత్తగా కొలువుదీరిన బైడెన్ సర్కారు.. వాణిజ్య ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్పష్టత లేదు. భవిష్యత్‌లో చైనాపై ఆధారపడటం తగ్గించాలని యాపిల్ సైతం భావిస్తోందట. దీంతో చైనాకు ప్రత్యామ్నాయంగా యాపిల్ తన ఉత్పత్తుల తయారీని భారత్, వియత్నాం దేశాలకు తరలించనుంది. ఈ మేరకు యాపిల్ 5జీ ఉత్పత్తులతో పాటు, ఐఫోన్‌ 12 సిరీస్‌  మోడల్స్‌ను భారత్‌లో, ఐపాడ్‌లను వియత్నాంలో తయారు చేయాలని భావిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

2021 ప్రథమార్ధం లేదా ద్వితీయార్ధంలో కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న విస్ట్రోన్ కార్పొరేషన్‌ ప్లాంట్‌లో ఐఫోన్‌ 12 ఉత్పత్తి ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్లాంట్‌లో ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ 11 మోడల్స్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. యాపిల్‌కు విడిభాగాలను సరఫరా చేసే పెగట్రాన్‌, విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ కంపెనీలు భారత్‌లో తయారీపట్ల ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. అలానే ఈ మూడు కంపెనీలు యాపిల్‌లో 6.64 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయట. ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ కంపెనీ వియత్నాంలో యాపిల్ తయారీకి సంబంధించి గతేడాది చివర్లో 270 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది.

ఇవీ చదవండి..

మహిళను కాపాడిన యాపిల్ వాచ్‌..! 

ఐఫోన్ 13లో అదిరిపోయే ఫీచర్స్..అవేంటంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని