
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
24, 25 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహణ
70 దేశాల నుంచి 30 వేల మంది పాల్గొనే అవకాశం
తెలంగాణ జైత్రయాత్రలో ఈ సదస్సుది అమూల్యపాత్ర
మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: బయో సాంకేతికత, జీవశాస్త్రాలపై అతి పెద్ద అంతర్జాతీయ బయో ఆసియా-19 సదస్సును హైదరాబాద్ వేదికగా వచ్చే నెల 24, 25 తేదీల్లో దృశ్యమాధ్యమంలో నిర్వహిస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు, అంకుర వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఏడాది సదస్సుకు ‘భవిష్యత్తుకు సిద్ధం (ఫ్యూచర్ రెడీ)’అనే నినాదాన్ని సోమవారం ఎంపిక చేశారు. సదస్సు తేదీలను ప్రకటించారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తినాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
నిర్వహణలో దిగ్గజ సంస్థలు
సదస్సు నిర్వహణలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, నోవార్టిస్, అరబిందో ఫార్మా.. హెటిరో, లారస్ ల్యాబ్స్ వంటి సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. వీటితో పాటు జీవశాస్త్రాల పరిశ్రమలోని భారత్ బయోటెక్, జీవీకే, ఫెర్రింగ్, సైటివా వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి బలరామ్ భార్గవ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోబెల్ బహుమతి విజేతలు డాక్టర్ కర్ట్ వుత్రిచ్, అడా యోనాథ్, హెరాల్డ్ జుర్ హౌసెన్, బారీ మార్షల్, మార్టిన్ జె ఎవాన్స్, లాస్కర్ అవార్డు గ్రహీతలు, డాక్టర్ వాస్ నరసింహన్ వంటి ప్రముఖులు చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు.
నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది
ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ ‘‘ఔషధ, జీవశాస్త్రాల రంగాలకు ప్రపంచస్థాయి కేంద్రం (హబ్)గా, టీకాల రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. వైద్యఆరోగ్య సంరక్షణలో భారతదేశంతో పాటు ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు అమూల్యపాత్ర పోషిస్తోంది. గత 18 ఏళ్లలో బయో ఆసియా సదస్సు ద్వారా రూ. 19,400 కోట్ల విలువైన 270 పైగా ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఈ సదస్సులో ప్రసిద్ధ నిపుణులు తమ పరిశోధనలను ఆవిష్కరించనున్నారు. కరోనా అనుభవాల నేపథ్యంలో ఇది కొత్త పరిష్కారాలను చూపుతుంది. నూతన ఆవిష్కరణలు, ప్రయోగాలకు నాంది అవుతుంది. జీవశాస్త్రాల రంగ ప్రస్తుత గమనం, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలపై చర్చాగోష్ఠులు జరగనున్నాయి. కరోనా విసిరిన సవాళ్లు..ఆరోగ్య పరిరక్షణలో సాంకేతిక అవకాశాలు, టీకాలలో భారత్ పాత్ర వంటి అంశాలపై చర్చిస్తాం. సదస్సుకు అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తాం’’ అని తెలిపారు.