CM KCR: జనం కోరితే జాతీయ పార్టీ
దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తనకు ఆ దమ్ముందని అవసరం వస్తే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ...
మోదీ పాలనలో దేశం సర్వనాశనం
సంస్కరణల పేరిట విద్యుత్ ప్రైవేటీకరణ
భాజపా పాలకుల అవినీతిపై దిల్లీలో పంచాయితీ పెడతా
జైలుకెళ్లాల్సింది వాళ్లే
ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు
ఈనాడు - హైదరాబాద్
దేశాన్ని ఆగం పట్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. అన్ని రాజకీయశక్తులూ ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి. ప్రజలంతా కలిసి వస్తే.. నాయకుల పీఠాలు కదిలే పరిస్థితి వస్తుంది.
దళితుల, బడుగువర్గాల అభ్యున్నతి, సమాన హక్కుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలి. 19 శాతానికి పెరిగిన దళిత జనాభాకు రిజర్వేషన్లు పెరగడానికి రాజ్యాంగం మారాలి. ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికలు దేశమంతా ఉండాలి. బీసీల జనగణన, హక్కుల కోసం రాజ్యాంగం మారాలి. దేశంలోని 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దు. 77 శాతం సంపద 90 శాతంమంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి. అంబేడ్కర్ మహనీయుడే రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలన్నారు.
దేశంలో రాజకీయ ఫ్రంట్ కాదు.. ప్రజల ఫ్రంట్ వస్తుంది. నిన్ననే నాతో మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్కు ఆహ్వానించారు. త్వరలో ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా.
ఏయ్ కేసీఆర్.. నీ సంగతి చూస్తం అంటరు. ఏంది చూసేది? కేసీఆర్ భయపడతాడా? దమ్ముంటే భాజపా మొనగాడెవరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. దేశం అన్ని రంగాల్లో వెనకబడలేదా? నిరుద్యోగం పెరగలేదా?
- ముఖ్యమంత్రి కేసీఆర్
దేశ ప్రజలంతా కోరితే.. తప్పకుండా జాతీయ పార్టీ పెడతానని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తనకు ఆ దమ్ముందని అవసరం వస్తే తప్పకుండా పార్టీ పెడతానన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ‘‘తెరాస పార్టీ పుట్టిన నాడు ఏమన్నారు.. ఇప్పుడు ఏమైంది? ఇది ప్రజాస్వామ్యం.. జనం ప్రభంజనమైననాడు అంతా తలకిందులు అయితది. అంతెందుకు చాయ్ అమ్ముకున్నా.. అని మోదీనే చెప్పారు కదా. ఆయన ప్రధాని కాలేదా. సినీ నటులు ఎంజీఆర్, ఎన్టీఆర్ ముఖ్యమంత్రులయ్యారు. ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ.. ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది’’ అని సీఎం అన్నారు. భాజపా పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కంపేనని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం మొత్తం సర్వ నాశనమవుతోందని ఆరోపించారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, భాజపా పిచ్చి, పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు. బ్యాంకులను లూటీ చేసే ఘోరమైన గజదొంగలను సురక్షితంగా దేశం బయటికి పంపారని ఆరోపించారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనడం దుర్మార్గమని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణల పేరిట సబ్సిడీలు నిలిపివేయాలి, బడుగువర్గాలకు ఉచిత విద్యుత్ను రద్దు చేసి.. దొంగలకు సద్ది కట్టాలన్నదే భాజపా విధానంగా ఉందన్నారు. అస్సాం భాజపా సీఎం కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎంతో చరిత్ర గల కుటుంబంపై సంస్కారం లేకుండా మాట్లాడడం సభ్యత కాదని, అలాంటివి ఎవరూ చేసినా తాను వ్యతిరేకిస్తానని తెలిపారు. కాంగ్రెస్తో పొత్తు కోసం రాహుల్ వెనుకేసుకురావాల్సిన ఖర్మ తనకు పట్టలేదని పేర్కొన్నారు. భాజపా అవినీతి చిట్టా తన వద్ద ఉందని, ఒక్కొక్కటి బయటపెడతామన్నారు. భాజపాకి దమ్ముంటే తనను జైలుకు పంపాలని... తన విషయం ఎలా ఉన్నా భాజపా నేతలు మాత్రం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో విడుదల చేసిన పత్రాలు, విమర్శకుల పుస్తకాలు, రఫేల్ విమానాల కొనుగోలుపై వచ్చిన వార్తలను చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా?
‘‘ధర్మం పేరిట అంతర్యుద్ధాలను ప్రోత్సహిస్తారా? అమెరికాలో 95 శాతం క్రైస్తవులు ఉంటరు. వాళ్లెప్పుడూ మతపిచ్చి లేపరు. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇక్కడ పొద్దునలేస్తే ఈ పిచ్చి కొట్లాటలు. దాంతో వచ్చేదేంది? ప్రజలు ఆలోచించాలి. రాజకీయంగా అర్థంచేసుకొని స్పందించకపోతే, అవసరమైన విధంగా ప్రజలు తీర్పు చెప్పకపోతే దేశం శ్మశానం అయిపోతుంది. నేను బాధతో చెబుతున్నా. మత పిచ్చి లేపితే ఊరుకుంటామా? ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు. నాశనం చేస్తే చేతులు ముడుచుకొని ఎవడూ కూర్చోడు. భాజపా హయాంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం మరింత పెరిగింది.
రఫేల్లో గోల్మాల్..
రఫేల్ విమానాల కొనుగోలులో గోల్మాల్ జరిగింది. రూ. వేల కోట్లు కాజేశారు. ఇండోనేషియా మనకంటే చౌకగా కొన్నది. భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. దీనిపై దిల్లీలో పంచాయతీ పెడతా. నన్ను జైల్లో పెట్టుడు కాదు.. మిమ్మల్ని జైలుకు పంపేది పక్కా.
కిషన్రెడ్డీ... ఏమిటీ వ్యాఖ్యలు?
ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అంటున్నారు. రూ. 34,900 కోట్ల ఎరువుల సబ్సిడీ తగ్గించింది అబద్ధమా కిషన్రెడ్డి గారూ? ఆహార సబ్సిడీని రూ. 65 వేల కోట్లు తగ్గించింది అబద్ధమా? 40 కోట్ల జనాభా ఉన్న దళితులకు పెట్టింది రూ. 12,800 కోట్లు నిజం కాదా? మీ ఘనత వహించిన ప్రభుత్వంలో దళితులు ఒక్కొక్కరికి రూ. 300 వస్తయి. ఇదేనా ప్రగతి? మా రాష్ట్రం నుంచి ఉన్న ఒకే ఒక్క కేంద్రమంత్రివని మర్యాద పాటించి చెబుతున్నా. మరోసారైతే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను చూస్తే జాలేస్తోంది. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్. రోజురోజుకీ ఆ పార్టీ పరువుపోతోంది.
అమెరికానా.. అహ్మదాబాద్ ఎన్నికలా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మోదీ వెళ్లి ప్రచారం చేయడంతో భారత్ పరువు పోయింది. అవి అమెరికా ఎన్నికలా.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా? అదొక వ్యూహాత్మక తప్పిదం. ఇప్పుడు మోదీ అమెరికాకు వెళితే పట్టించుకునే వాళ్లే లేరు. దేశంలోని వివిధ బ్యాంకులను ముంచిన 33 మంది లండన్లో యథేచ్ఛగా తిరుగుతున్నారు. వారిలో చాలామంది మోదీ దోస్తులే. అందుకే భాజపాను తరిమికొట్టాలని చెబుతున్నా. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపుర్లలో గెలవకపోయినా పాలిస్తోంది. మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించి.. బోల్తా పడింది.
సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారాలివ్వండి..
సైన్యం జరిపిన మెరుపుదాడుల సందర్భంగా ఏం జరిగిందో కేంద్రం బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయటంలో తప్పేం లేదు. నేను కూడా ఇప్పుడు వాటి ఆధారాలు అడుగుతున్నాను. ఎన్నికల సమయంలో మెరుపు దాడులు పొలిటికల్ స్టంట్ అని దేశంలో సగంమంది నమ్ముతున్నారు. నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.
పీకే బృందం సర్వే చేస్తోంది
దేశంలో రాజకీయ పరిస్థితులపై పీకే బృందం సర్వే నిర్వహిస్తోంది. తెలంగాణలో కూడా వారు చేస్తున్నారు. ఇప్పటికే తెరాస సర్వేలు చేయిస్తోంది. పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తాం.
కరోనా వల్ల ప్రధాని పర్యటనకు వెళ్లలేదు
మా కుటుంబంలో ఇద్దరికి కరోనా రావడం వల్ల ఈ నెల 5న ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోయాను. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా... ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తాం.
రాష్ట్రంలో కొత్త బడ్జెట్ రూ. రెండు లక్షల కోట్లకు చేరుతుంది. ప్రస్తుత బడ్జెట్లో రూ. 1.86 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా రూ. 30 వేల కోట్ల ఆదాయం రానుంది. మరింత రావాలని ఆశిస్తున్నాం.
యాదాద్రి పిలుపులపై ఆలోచించలేదు
యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఎవరిని పిలవాలనేదానిపై ఇంకా ఆలోచించలేదు. ఇప్పటికే మోదీని పిలిచా. మరో నెల సమయం ఉంది. ఏం జరుగుతుందోచూడాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
రెండున్నర గంటల పాటు ప్రెస్మీట్
సీఎం రెండున్నర గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో మోదీ గజ్వేల్ పర్యటనలో విద్యుత్ కొనుగోలు ధరపై చెప్పిన మాటలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంపు గెలుస్తారనే వ్యాఖ్యలపై వీడియోలను చూపారు. అయామ్ ట్రోల్ పేరిట స్వాతి చతుర్వేది భాజపా డిజిటల్ ఆర్మీ గురించి రాసిన పుస్తకాన్ని చూపారు. ఆ పుస్తకాలను ప్రచురించి పంపిణీ చేస్తామన్నారు. రఫేల్ విమానాల కొనుగోళ్ల కుంభకోణం వార్తాంశాలను ప్రదర్శించారు. చివరిలో ప్రధాని పర్యటన గురించి ఒక విలేకరి ప్రస్తావించగా.. అంతకుముందు మజ్లిస్ అధినేత అసదుద్దీన్పై యూపీలో దాడి జరగడంతో కేంద్ర హోంమంత్రి అమిత్షా తనకు ఫోన్ చేసి ప్రధాని భద్రత ఏర్పాట్ల గురించి మాట్లాడారని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని తాను హామీ ఇచ్చానని తెలిపారు.
విద్యుత్ చట్టంపై ఒత్తిడి తెస్తున్నారు
‘‘రాష్ట్రం విద్యుత్ సంస్కరణలు అమలు చేయకుంటే.. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకపోతే నిధులు ఇవ్వకుండా కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో 25 వేల మీటర్లు పెట్టింది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు. ఇప్పుడు ఆధారాలు బయటపెట్టాం. వెంటనే ఆయన బహిరంగ క్షమాపణ వేడుకోవాలి. విద్యుత్ సంస్కరణల బిల్లు ఇంకా ముసాయిదాలోనే ఉంది. అయినా ఒత్తిడి తెచ్చి సంస్కరణలను అమలు చేయిస్తోంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. దేశ ప్రజలను మోసం చేయడమే. రాష్ట్రాలు రూ. 11కి యూనిట్ కొన్నాయి.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నామని గజ్వేల్ సభలో ప్రధాని అబద్ధాలు చెప్పారు. కేంద్ర విద్యుత్ విధానం చెత్త. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చందాలు ఇచ్చే వాళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చేటోళ్లు పెట్టే సంస్థల నుంచి సౌర విద్యుత్ కొనిపించాలని కుట్ర చేస్తోంది. నాగార్జునసాగర్, శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి బంద్ పెట్టయినా దీన్ని కొనాలి.. లేదంటే జరిమానా వేస్తాం అంటున్నారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!