అష్ట దిగ్బంధంలో అమలాపురం

కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ జిల్లావాసుల్లో, పోలీసు

Updated : 26 May 2022 06:39 IST

ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత.. పునరుద్ధరణ
రావులపాలెంలో స్వల్ప ఉద్రిక్తత.. అదుపు చేసిన పోలీసులు

ఈనాడు, అమలాపురం- న్యూస్‌టుడే యంత్రాంగం: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారంనాటి ఉద్రిక్తత, విధ్వంస పరిస్థితులు చల్లారినా.. ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ జిల్లావాసుల్లో, పోలీసు యంత్రాంగంలోనూ నెలకొంది. బుధవారం అమలాపురం పట్టణంలో కొంతసేపు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. పోలీసులు భారీగా మోహరించి, పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కాలిపోయిన తమ ఇంటిని మంత్రి విశ్వరూప్‌ సతీసమేతంగా బుధవారం పరిశీలించారు. మరోవైపు.. మంగళవారంనాటి ఉద్రిక్త పరిస్థితులపై కోనసీమ యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రావులపాలెంలోనూ ఆందోళనలు మొదలయ్యే క్రమంలో.. వాటిని పోలీసులు అదుపుచేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

స్తంభించిన సేవలు

అమలాపురంలో ఉద్రిక్తత దృష్ట్యా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. తర్వాత మళ్లీ పునరుద్ధరించారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి అమలాపురం వచ్చే ఆర్టీసీ బస్సులను బుధవారం తాత్కాలికంగా రద్దుచేశారు. ఇంటర్‌ పరీక్షలు, ఇతర అత్యవసరాల దృష్ట్యా 11 గంటల తర్వాత పునరుద్ధరించారు. వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసేశారు.

పెట్రోలు బాంబులతో దాడులు

మంగళ]వారం నాటి ఆందోళనలో పలువురు అసాంఘిక శక్తులు చొరబడి పెట్రోలు బాంబులతో దాడులు చేసి ఆస్తులు దహనం చేసినట్లు అనుమానిస్తున్నారు. కొందరు పథకం ప్రకారమే మద్యం దుకాణాల వద్ద, సినిమాహాళ్లలో వాహనాలు నిలిపి అక్కడి నుంచి ఉదయం ఆట తర్వాత ఆందోళనలో కలిశారనే ప్రచారం సాగుతోంది. మంగళవారం నాటి ఘటనలో మంత్రి విశ్వరూప్‌ నివాసం వద్ద ఒక జీపు, ఐదు ద్విచక్రవాహనాలు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటిదగ్గర రెండు బైకులు.. కలెక్టరేట్‌ దగ్గర ఒక బస్సు, ఎర్రవంతెన దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించడానికి పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.  సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో 46 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీట్లు, ఇతర నేరచరిత్ర ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

ఉద్విగ్నం.. ఉద్రిక్తత

దాడులతో దెబ్బతిన్న భట్నవిల్లిలో ఇంటికి మంత్రి విశ్వరూప్‌ బుధవారం తన భార్య మీనాక్షితో కలిసి వచ్చారు. కాలిపోయిన ఇల్లు చూసి దంపతులు ఉద్విగ్నతకు లోనయ్యారు. ఆయన అభిమానులు, అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి ప్రతినిధులు... పోలీసులు, ఆందోళనకారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.

ప్రభుత్వానికి నివేదిక

అమలాపురంలో మంగళవారం నాటి ఉద్రిక్త పరిస్థితులపై జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. మంగళవారం పరిణామాలను.. విధ్వంసం తీరును నివేదికలో పేర్కొన్నారు. పరిస్థితిని అంచనా వేసి ఈనెల 22న కోనసీమ జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ చట్టం అమల్లోకి తెచ్చామన్నారు. కోనసీమ సాధన సమితి ఈ నెల 22న తలపెట్టిన ఆందోళనలో అనుచిత ఘటనలు జరగకుండా నిలువరించామన్నారు. ఆందోళన విషయం గుర్తించి ఈ నెల 24న ఉదయం నుంచి అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా 5వేల మంది వరకు వచ్చారని, కొందరిని కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించడానికి అనుమతించేటప్పుడే బయట దాడులకు పాల్పడ్డారని తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి ప్రత్యేక బలగాలు రప్పించడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌తోపాటు..ముమ్మిడివరం ఎమ్మెల్యే సోదరుడి టింబర్‌ డిపోలపై దాడులకు పన్నిన కుట్రను భగ్నం చేయగలిగామని నివేదికలో తెలిపారు.

మరోవంక.. సీసీటీవీ ఫుటేజీ, సామాజిక మాధ్యమాలు, స్పెషల్‌ బ్రాంచి ద్వారా ఫుటేజీలు సేకరించి విధ్వంసాలకు పాల్పడిన చాలామందిని గుర్తించామని ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు తెలిపారు. హింసకు కారకులైన 46 మందిని అదుపులోకి తీసుకుని ఆరు కేసులు పెట్టామని ఆయన వివరించారు.

మా నాయకులను తప్పుదోవ పట్టించారు..

‘అమలాపురంలో అల్లర్ల వెనక తెదేపా, జనసేన ద్వితీయశ్రేణి నాయకులున్నారు. ఈ విధ్వంసానికి కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. కోనసీమ, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచోళ్లు. శాంతియుత ధర్నాలో కొంతమంది సంఘ విద్రోహులు, అమలాపురం పరిసరాల్లోని రౌడీషీటర్లు చేరి ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు. మా ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు తగులబెట్టారు. డీఎస్పీ బాషా కాల్పులు జరిపి గుంపును చెల్లాచెదురు చేసి ఎమ్మెల్యే దంపతులను బయటకు తీసుకొచ్చారు. 50 ఏళ్ల కోనసీమ చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ లేవు. దీనివెనుక అమలాపురంలోని ద్వితీయ శ్రేణి తెదేపా, జనసేన నాయకులున్నారు. పేర్లు మాదగ్గర ఉన్నాయి. వైకాపా బీసీ కౌన్సిలర్‌తో నాలుగైదు రోజులుగా ఎవరెవరు సంప్రదించారో సమాచారం ఉంది. ఫైరింగ్‌ చేయడం మా అభిమతం కాదు.. ఫైరింగ్‌ చేయాలంటే 5 నిమిషాల పని. కానీ పోలీసులు సంయమనం పాటించారు. తప్పుచేసిన ప్రతిఒక్కరినీ శిక్షిస్తాం’ అంటూ మంత్రి హెచ్చరించారు.  దీనిపై తెదేపా నేత చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్లు వైకాపా ప్రేరేపితమని, ఘటన వెనుక ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక వైకాపా పాత్ర ఉందని జనసేన నాయకులు ఆరోపించారు.

అన్యం సాయి చుట్టూ వివాదం

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఈ నెల 20న జరిగిన ఆందోళనలో అమలాపురానికి చెందిన అన్యం సాయి ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈయన వైకాపా కార్యకర్తని, మంత్రి విశ్వరూప్‌, ఇతర వైకాపా నాయకుల చిత్రాలతో సాయి ముద్రించినట్లున్న ఫ్లెక్సీ.. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో సాయి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజును సాయి నిర్వహిస్తున్న చిత్రాలూ వాట్సప్‌లో తిరుగుతున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ సీఎం జగన్‌, ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో తీసుకున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తిరిగాయి.


రావులపాలెంలో కట్టుదిట్టం

ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే-రావులపాలెం పట్టణం: కోనసీమ ఆందోళన అమలాపురం నుంచి బుధవారం రావులపాలేనికి పాకింది. ‘చలో రావులపాలెం’ పేరుతో యువత పెద్దఎత్తున నిరసన చేపట్టాలని భావించగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటుచేశారు. ర్యాలీకి సిద్ధమైన 50 మంది నిరసనకారులను అడ్డుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రావులపాలెం వచ్చే మార్గాలన్నీంటిలో 20 చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. వచ్చే వాహనాలన్నీ ఆపి తనిఖీ చేసి పంపారు. తూర్పుగోదావరి ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సాయంత్రం పట్టణంలో బందోబస్తు పర్యవేక్షిస్తుండగా ఒక నిరసనకారుడు ఇటుక రాయి విసిరారు. అది ఎస్పీ కాన్వాయ్‌ వాహనానికి తగిలింది. దీంతో భద్రతాదళాలు ఆందోళనకారులను చెదరగొట్టాయి. రావులపాలెంలో బుధవారం ఇంటర్నెట్‌ సర్వీసులు, ఫోన్లు మధ్యాహ్నం వరకూ సక్రమంగా పని చేయలేదు. అమలాపురం వెళ్లే 90 బస్సు సర్వీసులు మధ్యాహ్నం వరకు ఆపేశారు.

మోహరించిన బలగాలు

ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రత్యేక బలగాలతో పాటు 1,400 మంది పోలీసులు అమలాపురంలో మోహరించారు. అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ పర్యవేక్షణలో.. బెటాలియన్‌ అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు, ఎస్పీలు రవీంద్రనాథ్‌ బాబు, ఐశ్వర్య రస్తోగి, విశాల్‌ గున్నీ, రవిప్రకాశ్‌ తదితరుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. మంగళవారం రాత్రి నుంచి అమలాపురం అష్ట దిగ్బంధంలోకి వెళ్లింది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ పోలీసులు మోహరించడంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. బుధవారం ఉదయం 11 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని