మద్యం మార్కెట్‌ కోసం మాయోపాయాలు

దేశ రాజధాని దిల్లీలో మద్యం వ్యాపారం ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వ్యాపారులు అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది.

Published : 04 Feb 2023 03:42 IST

దిల్లీ కేసు అభియోగపత్రంలో ఈడీ

ఈనాడు, హైదరాబాద్‌: దేశ రాజధాని దిల్లీలో మద్యం వ్యాపారం ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వ్యాపారులు అనేక అవకతవకలకు పాల్పడ్డట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. ఈ కుంభకోణం బయటపడగానే ఆధారాలు మాయం చేయడంతోపాటు తప్పుడు నివేదికలు ఇవ్వడం, ప్రజాభిప్రాయం కూడా తమకు అనుకూలంగా వచ్చినట్లు నమ్మించడం సహా అనేక మాయోపాయాలకు పాల్పడినట్లు ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది. మద్యం కొత్త విధానం రూపొందించేందుకు దిల్లీ ప్రభుత్వం కంటితుడుపుగా నిపుణుల కమిటీని నియమించిందని, ఆ కమిటీ సూచనలను ఎక్కడా అమలు చేయలేదని ఈడీ పేర్కొంది.

ఇవీ అభియోగాలు..

మద్యం హోల్‌సేల్‌ వ్యాపారం ప్రభుత్వం వద్దనే పెట్టుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. తద్వారా రిటైల్‌ వర్తకులకు ప్రభుత్వం ద్వారానే మద్యం విక్రయిస్తే.. వెంటనే ఆదాయం వస్తుంది. దీన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న మంత్రుల కమిటీ సూచనలను నిపుణుల కమిటీ వ్యతిరేకించింది. చివరకు ప్రైవేటు వ్యక్తులకే అప్పగించాలని నిర్ణయించారు.

ఇటువంటి మార్పులు అనేకం చేశారని, దీనిపై ప్రజాభిప్రాయం కూడా తమకు అనుకూలంగానే ఉన్నట్లు చెప్పేందుకు మద్యం వ్యాపారులు ప్రయత్నించినట్లు ఈడీ గుర్తించింది. ‘ప్రజాభిప్రాయ’ బాధ్యతలను ‘ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఏర్పాటైన మద్యం వ్యాపారుల సంఘం ఓ ప్రచార సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ కొత్త విధానాన్ని సమర్థిస్తూ.. నాలుగు వేల ఈ మెయిల్స్‌ పంపేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 45 వేర్వేరు ఫార్మాట్లలో లేఖలు, వీటిని పంపేందుకు వెయ్యి ఈ మెయిల్‌ ఐడీలు కూడా సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువ ధరకే తాము మద్యం అమ్ముతున్నట్లు వ్యాపారులు అఫిడవిట్‌ దాఖలు చేయాలని కొత్త విధానంలో ఓ నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాల కంటే దిల్లీలోనే మద్యం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని ఈడీ ఆరోపించింది. దీన్ని పరిశీలించకుండానే ఆబ్కారీశాఖ అనుమతించిందని పేర్కొంది.

దర్యాప్తు మొదలైన తర్వాత ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఫోన్లు ధ్వంసం చేయడంతోపాటు నిందితులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కొంతమంది నిందితులు ముందుజాగ్రత్త చర్యగా సిమ్‌ కార్డులు, ఫోన్లు వేరేవారి పేర్లమీద కొనుగోలు చేశారు. ఉదాహరణకు మనీశ్‌ సిసోదియా నాలుగు ఫోన్లు, ఒక సిమ్‌ కార్డు ఇతరుల పేర్లమీద కొని వాడుకున్నారు.

శరత్‌చంద్రారెడ్డి తమ మద్యం సంస్థల సర్వర్లను కూడా మార్చేందుకు ప్రయత్నించారు. డిఫెన్స్‌ కాలనీలో ఉన్న ట్రైడెంట్‌ చెంపార్‌, ఆర్గానమిక్స్‌, శ్రీ అవంతిక సంస్థలకు చెందిన మూడు మద్యం సంస్థల సర్వర్లను అక్కడి నుంచి వెంటనే తొలగించాలని శరత్‌చంద్రారెడ్డి తనను ఆదేశించినట్లు ఆయన అనుచరుడు చందన్‌రెడ్డి దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు. మద్యం విధానం రూపకల్పన దగ్గర నుంచి వ్యాపార లావాదేవీలన్నీ ఈ సర్వర్ల నుంచే జరిగి ఉంటాయని.. అందుకే వాటిని తరలించేందుకు ప్రయత్నించారని అధికారులు భావిస్తున్నారు. కాని తమ సాంకేతిక బృందం ఈ సర్వర్లను స్వాధీనం చేసుకోగలిగిందని ఈడీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని