Xi Jinping: బిల్‌గేట్స్‌తో షీజిన్‌పింగ్ భేటీ..!

చైనా అధినేత షీజిన్‌పింగ్‌.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత తొలిసారి ఓ విదేశీ వ్యాపారవేత్తతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి.

Published : 16 Jun 2023 13:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్‌(Bill Gates)తో చైనా అధినేత షీజిన్‌పింగ్‌ (Xi Jinping) భేటీ అయ్యారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. చాలా కాలం తర్వాత ఓ విదేశీ వ్యాపారవేత్తతో జిన్‌పింగ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. దాదాపు మూడేళ్ల నుంచి జిన్‌పింగ్‌ విదేశీ పర్యటనలను నిలిపివేశారు. 2019 తర్వాత బిల్‌గేట్స్‌ తొలిసారి బీజింగ్‌లో అడుగుపెట్టారు.

ఇక బిల్‌గేట్స్‌-జిన్‌పింగ్‌ మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా చైనా అధినేత మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది నేను బీజింగ్‌లో కలిసిన తొలి అమెరికన్‌ మిత్రులు మీరే. మేము ఎల్లప్పుడూ అమెరికన్‌ ప్రజలపై ఆశలు పెట్టుకొంటాం. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

బిల్‌గేట్స్‌ తన పర్యటనలో భాగంగా గ్లోబల్‌ హెల్త్‌ డ్రగ్‌ డిస్కవరి ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సాంకేతికత వినియోగంపై ప్రసంగించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను బీజింగ్‌ స్థానిక ప్రభుత్వ, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కలిసి సింగ్వా విశ్వవిద్యాలయం సహకారంతో ఏర్పాటు చేశాయి. ఇక్కడ కొత్త ఔషధాలు కనుగొనేందుకు వీలుగా చెరో 50 మిలియన్‌ డాలర్లు కేటాయించాయి. ఈ నిధులతో మలేరియా, క్షయలతో పోరాడేందుకు చైనాకు సహకరించనున్నారు. ఈ సందర్భంగా గేట్స్‌ ఫౌండేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా పేదలకు సోకే మలేరియా, క్షయ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడేందుకు అవసరమైన చికిత్సలను మెరుగుచేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని