Population: భారత్‌ జనాభా 142.86కోట్లు.. చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!

ప్రపంచంలో అత్యధిక జనాభా (Most Populous) కలిగిన దేశాల జాబితాలో భారత్‌ తొలిస్థానానికి ఎగబాకింది. సుమారు 29లక్షల మందికి పైగా జనాభాతో చైనాను (China) భారత్‌ (India) అధిగమించింది. భారత్‌ జనాభా 142.86కోట్లు కాగా.. చైనాలో 142.57కోట్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి (United Nations) జనాభా విభాగం అంచనా వేసింది.

Updated : 19 Apr 2023 16:57 IST

దిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస (United Nations) బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.

జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023’ పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ (UNFPA) తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.

2050 నాటికి 166.8కోట్లు

ఐరాస వెలువరించిన వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌-2022 ప్రకారం.. గతేడాది నవంబర్‌ 15న ప్రపంచ జనాభా 800కోట్లు దాటింది. 1990లో చైనా జనాభా 114.4కోట్లు ఉండగా.. భారత జనాభా కేవలం 86.1కోట్లు మాత్రమే. గతేడాది నాటికి మనదేశ జనాభా 141.2కోట్లకు చేరగా.. చైనా జనాభా 142.6కోట్ల వద్దే ఉంది. ఇలా 2050 నాటికి భారతదేశ జనాభా 166.8 కోట్లకు పెరుగుతుందని తాజా నివేదిక అంచనా వేసింది. అదే చైనా జనాభా మాత్రం 131.7కోట్లకు పడిపోతుందని పేర్కొంది. 

భారత్‌లో 25శాతం మంది 14ఏళ్లలోపే..

తాజా నివేదిక ప్రకారం, దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 25శాతం మంది 0-14 ఏళ్ల మధ్యవారే కాగా.. 15 నుంచి 64ఏళ్ల మధ్య వయసు వారు 68శాతం, 65ఏళ్లకు పైబడినవారు 7శాతం ఉన్నట్లు అంచనా. ఇక 15 నుంచి 24ఏళ్ల మధ్య యువత సంఖ్య 25.4కోట్లుగా ఉంది. 10 నుంచి 19ఏళ్ల వయసున్నవారు 18శాతం, 10-24ఏళ్ల మధ్య వయస్కులు 26శాతం ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఆయుర్దాయం పురుషుల్లో 71ఏళ్లు కాగా మహిళలకు 74ఏళ్లుగా ఉంది.

ప్రపంచ జనాభా 804.5కోట్లుగా అంచనా వేయగా అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్‌, చైనాలోనే ఉంటుందని అంచనా. అయితే, కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గగా.. భారత్‌లో కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2శాతం పెరుగుతూ వస్తుండగా.. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7శాతంగా ఉంది. గతేడాది చైనా గణాంకాల ప్రకారం, అక్కడ గత ఆరు దశాబ్దాల్లో తొలిసారి భారీగా జనాభా క్షీణించినట్లు వెల్లడైంది.

గతంలో యూఎన్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన నివేదికలను బట్టి చూస్తే ఏప్రిల్‌లోనే ఈ రికార్టు నెలకొల్పనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, జనాభాకు సంబంధించి భారత్‌, చైనా నుంచి సరైన సమాచారం అందకపోవడం వల్లే ఈ రికార్డు తేదీని కచ్చితంగా చెప్పలేకపోతున్నట్లు ఐరాస జనాభా విభాగం అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో 2011లో జనగణన జరిగింది. తిరిగి 2021లో వాటిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా జాప్యమైంది.

భారత్‌లో జనాభా వేగంగా పెరుగడంపై సామాన్యుల్లో ఆందోళన కనిపిస్తోందని తాజా సర్వేలో తేలిందని యూఎన్‌ఎఫ్‌పీఏ భారత ప్రతినిధి ఆండ్రియా వొజ్‌నార్‌ పేర్కొన్నారు. అయితే, జనాభా పెరుగుదల అనేది ఆందోళన అంశంగా చూసే బదులు పురోగతి,  అభివృద్ధి, వ్యక్తిగత హక్కులు, మరిన్ని అవకాశాలకు చిహ్నంగా చూడాలని ఆండ్రియా అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు