Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష.. ఆ వెంటనే అరెస్టు

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan)కు ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది.

Updated : 05 Aug 2023 16:38 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసు (Toshakhana corruption case)లో ఆయనను దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్‌ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్‌ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.

తీర్పు వచ్చిన క్షణాల్లోనే అరెస్టు..

మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్‌ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాకిస్థాన్‌లో ఎన్నికల నగారా

ఇమ్రాన్‌ ఖాన్‌పై అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నెల 9 నెల జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్‌ ఇప్పటికే ప్రకటించారు.

ఏంటీ తోషాఖానా కేసు..

గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది.

ఇమ్రాన్‌ తన హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోరపణలు ఉన్నాయి. మొత్తంగా 11.9కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన వస్తువులను ఆయన కేవలం 2.4కోట్ల పాకిస్థానీ రూపాయలకే తీసుకున్నారని మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు. వాటిల్లో కొన్నింటిని దుబాయ్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని