రాజహంస

హంస రాజస లక్షణాలున్న నీటి పక్షి. అందువల్ల రాజహంస అనీ పిలుస్తారు. సంస్కృతంలో మరాళం అంటారు. తెలుగులో తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు అనే పేర్లున్నాయి. భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్నిచ్చి గౌరవించింది.

Published : 07 Feb 2024 00:36 IST

హంస రాజస లక్షణాలున్న నీటి పక్షి. అందువల్ల రాజహంస అనీ పిలుస్తారు. సంస్కృతంలో మరాళం అంటారు. తెలుగులో తెలిపిట్ట, చక్రాంగన, శ్వేతగరుత్తు అనే పేర్లున్నాయి. భారతీయ ధర్మం హంసకు పరమోన్నత స్థానాన్నిచ్చి గౌరవించింది. వేదకాలం నుంచి హంస గొప్పతనం అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి వైదిక సాహిత్యంలోను, పురాణ కథల్లోనూ హంస ప్రస్తావన ఉంటుంది. దేవతల్లో ఒక్కొక్కరికీ ఒక్కో వాహనం ఉంది. భార్యాభర్తలైన బ్రహ్మదేవుడు, సరస్వతి ఇద్దరికీ- హంసే వాహనం.

భారతీయ ఆధ్యాత్మిక చింతనలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. వేదాల్లో హంస గాయత్రీ మంత్రం ప్రసిద్ధి చెందింది. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న 31 ఉపనిషత్తుల్లో హంసోపనిషత్తు ఒకటి. వేదాలు, శాస్త్రాల్లో అత్యున్నత స్థాయికి చేరినవారిని ‘పరమహంస’ అని ప్రస్తుతిస్తారు.

వేదాంత బోధనపరంగా హంసకు విశేష స్థానం ఉంది. నీళ్లలో విహరిస్తున్నప్పటికీ హంస రెక్కలు తడవవంటారు. అలాగే సంసార సాగరంలో చిక్కుకున్నప్పటికీ, మనిషి ఏ మమకారానికీ లోనుకాకుండా జీవించాలని చెబుతారు. హంసకు పాలను, నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందంటారు. నిజానికి పాలు నీరు కలిసిన మిశ్రమంలో నుంచి పాలను మాత్రమే తాగి నీటిని పాత్రలో వదిలేస్తుందట. అలాగే మంచిచెడుల మిశ్రమమైన జీవన గమనంలో మంచిని స్వీకరించి, చెడును విడిచిపెడితే జీవితం సుసంపన్నం అవుతుందని పెద్దలు చెబుతారు. పై రెండు ఉదాహరణలకు సంకేతంగా హంసలా జీవించాలని చెబుతారు. యోగశాస్త్రం ప్రకారం హంస ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీక. లోనకు పీల్చే గాలిని(ఉచ్ఛ్వాసాన్ని) ‘హం’ అని, బయటకు విడిచిపెట్టే ఊపిరిని(నిశ్వాసాన్ని) ‘స’ అనీ అంటారు. అందుకే మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు ‘హంస ఎగిరిపోయింది’ అంటారు.

హంస నీటిలో విహరిస్తూ, ఆహారాన్ని సేకరించుకునే క్రమంలో ఒక దగ్గర మునుగుతూ, ఇంకో దగ్గర తేలుతూంటుంది. అలా మునిగి, తేలే ప్రాంతాల్లో అది విహరించిన గుర్తుగా నీళ్లు కదిలిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దృశ్యాన్నే అన్నమాచార్యులు- ‘దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బునీటిపై నొక హంస- అనువున కమల విహారమె నెలవైఒనరి ఉన్నదిదె ఒక హంసా- మనియెడి జీవుల మానస సరసుల ఉనికి నున్నదిదె ఒక హంసా’ అనే సంకీర్తనలో చెప్పాడు. 

ఆయన పాటలో నీటిమీద తేలుతున్న హంస అంటే సాక్షాత్తు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామే. మామూలు హంస కొలనులో కమలం పువ్వుల మధ్య విహరిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి రూపమైన శ్రీవేంకటేశ్వరుడు పాలసముద్రంలో కమల(లక్ష్మీదేవి స్వరూపమైన పద్మావతీదేవి)తో విహరిస్తూ ఉంటాడు. ఇక వేంకటాద్రి మీద వెలసిన హంస మాత్రం జీవుల మనసులనే సరోవరాల్లో విహరిస్తుందని అంటాడు అన్నమయ్య.

హంసలు హిమాలయాల్లో కైలాస పర్వతం దగ్గర ఉన్న మానస సరోవరంలో సంచరిస్తాయని అంటారు. ఆ సరస్సులో బంగారు వర్ణంతో మెరిసే పద్మాలు, మేలిమి ముత్యాలు ఉంటాయని, వాటినే అవి ఆహారంగా తీసుకుంటాయని చెబుతారు. నలదమయంతుల మధ్య ప్రేమ రాయబారాన్ని హంస నడిపినట్లు ప్రాచీన కావ్యాలు తెలుపుతున్నాయి.

 అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని