సిలబస్‌ సీబీఎస్‌ఈ.. పరీక్షలు రాష్ట్ర బోర్డువి!

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివి.. రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అధికారుల నిర్ణయంతో భవిష్యత్తులో విద్యార్థులకు వింత అనుభవం ఎదురుకానుంది.

Published : 20 Aug 2022 05:40 IST

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వింత పరిస్థితులు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివి.. రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అధికారుల నిర్ణయంతో భవిష్యత్తులో విద్యార్థులకు వింత అనుభవం ఎదురుకానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేస్తామని, 2025లో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఎనిమిదో తరగతికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పుస్తకాలను ముద్రించారు. వీటినే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు అందించారు. ప్రభుత్వ పాఠశాలలు విడతల వారీగా సీబీఎస్‌ఈకి అనుబంధంగా మారతాయని విద్యాశాఖ చెబుతోంది. ఈ ఏడాది మొదటి విడతగా 3,108 పాఠశాలలకు సీబీఎస్‌ఈ గుర్తింపునకు దరఖాస్తు చేశారు. అది లభిస్తే.. వీటిలో ఈ ఏడాది ఎనిమిదో తరగతి చదువుతున్నవారు 2025లో సీబీఎస్‌ఈ పది పరీక్షలు రాస్తారు. వీరికోసం ఈ ఏడాది ఎనిమిదో తరగతి, వచ్చే ఏడాది తొమ్మిది, ఆ తర్వాత పదోతరగతి ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ముద్రిస్తారు. రాష్ట్ర బోర్డు పుస్తకాలంటూ లేకపోవడంతో వీటినే విద్యార్థులందరికీ అందిస్తున్నారు. సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లేని ప్రభుత్వ, ప్రైవేటు బడుల పిల్లలూ ఈ పుస్తకాలనే చదవాలి. ఈ సిలబస్‌ చదివినా.. గుర్తింపు లేనందున రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయల్సి వస్తుంది.

మొదటి విడత 3వేలే..
రాష్ట్రంలో 44వేలకుపైగా బడులు ఉండగా.. ఇందులో 3వేలకే మొదటి విడతలో దరఖాస్తు చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికల, గిరిజన, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలున్నాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్తు పాఠశాలల్లో చాలావాటిలో సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సదుపాయాలు, స్థలాలు లేవు.

* రాష్ట్రంలో 15,182 ప్రైవేటు, 1,846 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. వీటిలో 70% వరకు ఉన్నత పాఠశాలలే. ఇవి రాష్ట్రబోర్డు పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఈ యాజమాన్యాలు సీబీఎస్‌ఈకి వెళ్లాలంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టంతో కూడుకున్నది. వీరూ సీబీఎస్‌ఈ పుస్తకాలు చదివి, రాష్ట్రబోర్డు పరీక్షలే రాయాలి. విద్యార్థులందరూ ఒకే సిలబస్‌ చదివినా పదో తరగతిలో కొందరికి సీబీఎస్‌ఈ మెమోలు, మరికొందరికి రాష్ట్ర బోర్డు మెమోలు వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని