Polavaram Project: బాధ్యులు ఎవరో తేల్చండి

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యులెవరో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. జరిగిన వైఫల్యాలపై సీరియస్‌ అయ్యింది.

Updated : 29 Jun 2023 09:47 IST

పోలవరం గైడ్‌బండ్‌ కుంగడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సీరియస్‌
వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టీకరణ
ముందే ఎందుకు జాగ్రత్త పడలేదని ప్రశ్నలు
ఇంకా సిద్ధం కాని నిపుణుల కమిటీ నివేదిక
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యులెవరో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. జరిగిన వైఫల్యాలపై సీరియస్‌ అయ్యింది. ఈ విషయంలో నిజనిర్ధారణ కమిటీ తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నివేదిక సిద్ధం చేసే పనిలోనే ఉన్నారని, కొంత సమయం పడుతుందని జల్‌శక్తి శాఖలోని కీలకవర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి వరకూ ఈ నివేదిక ఉన్నతాధికారులకు చేరలేదు. కొన్ని పరీక్షల నివేదికలు రావాలని, వాటి ఆధారంగా నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. గైడ్‌బండ్‌ ధ్వంసానికి కారణమేంటో నిర్ధారించి, బాధ్యులెవరో తేల్చాల్సిందేనని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధికారులకు నిర్దేశించారు. ఈ క్రమంలోనే ఆ శాఖ కార్యదర్శి వద్ద సమావేశం జరిగింది. ఇందులో గైడ్‌బండ్‌ వైఫల్యంపైనా కీలక చర్చ జరిగింది. ఎక్కడ లోపం జరిగిందన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరులశాఖ నిర్మిస్తోంది. ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగు సంస్థ నిర్మిస్తోంది. డిజైన్లు ప్రతిపాదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌కు వాటిని పంపి అనుమతులు తీసుకుంటారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యాప్కోస్‌ పర్యవేక్షణ కూడా ఉంది. ఈ క్రమంలో పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులో ఈ వైఫల్యానికి బాధ్యులను తేల్చి చర్యలు తీసుకోపోతే.. ప్రధాన డ్యాం నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా ఉండకపోతే ప్రమాదమని కేంద్రపెద్దలు కొందరు భావించి ఈ మార్గనిర్దేశం చేశారని తెలిసింది.

డిజైన్‌, నిర్మాణ లోపాలు రెండూ..

నిజనిర్ధారణ కమిటీ ప్రాథమికంగా కొన్ని అంశాలు గుర్తించింది. సీఎం జగన్‌ వద్ద తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలోనూ అధికారులు ఆ విషయాలు తెలిపారు. అందులో పైన పేర్కొన్న గైడ్‌బండ్‌ నిర్మాణ సమయంలోనే వరదలు రావడం, దానివల్ల మట్టి నమూనాలు మారిపోవడం అన్న అంశమూ ప్రస్తావించారు. ఈ ఆలస్యం వల్ల డిజైన్‌ పరంగా, నిర్మాణపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మేఘా ఇంజినీరింగ్‌ సంస్థకూ ఉంటుంది, స్థానికంగా పనులు పర్యవేక్షించే పోలవరం అధికారులకూ ఉంటుంది.

  • ఇక్కడ ఉన్న మట్టిలో పోర్‌ నీరు చేరడం కూడా ఒక కారణంగా పేర్కొంటున్నారు. డిజైన్‌ సమయంలో ఈ అంశాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదనే ప్రశ్న వినిపిస్తోంది.
  • రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంలో ప్యానెల్‌ జాయింట్లు విఫలమయ్యాయని ఒక కారణంగా పేర్కొన్నారు. అది నిర్మాణ వైఫల్యమే కదా అన్న ప్రశ్నకు సమాధానం ఏదీ?
  • సహజంగా ఏర్పడే డ్రైనేజి పోర్‌ నీటిని పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణం చేపట్టడమూ మరో కారణంగా గుర్తించారు.
  • అది ఏ కారణమైనా ఇక్కడ డిజైన్‌పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం స్పష్టంగా కనిపించడం విశేషం.

  • నిర్మాణంలో ఆలస్యం వల్లే మట్టి లక్షణాలు మారాయని, అందుకే గైడ్‌బండ్‌ కుంగిందని నిపుణులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా జరిగే అవకాశం ఉందని ముందే గుర్తించినప్పుడు తదనుగుణంగా ఆకృతులు మార్చుకోవచ్చు కదా అని కేంద్ర అధికారి ప్రశ్నించినట్లు సమాచారం. ఆ విషయం వారు తమకు తెలియజేయలేదని, లేకుంటే డిజైన్లు మార్చేవారిమని కేంద్రసంస్థ సభ్యుడు ఒకరు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే ఎలా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఇందులో బాధ్యులు ఎవరో కచ్చితంగా తేల్చాలని నిర్దేశించినట్లు సమాచారం.

నాలుగు నెలల్లో నిర్మించాల్సింది ఇన్ని నెలలా?

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే రక్షణలో భాగంగా నిర్మించాల్సిన గైడ్‌బండ్‌ను 4నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికి పైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్‌బండ్‌, రిటైనింగ్‌ వాల్‌ దెబ్బతిన్నాయనే అభిప్రాయాన్ని నిపుణులు ప్రాథమికంగా వ్యక్తం చేశారని తెలిసింది. కేంద్రజల్‌శక్తిశాఖ కార్యదర్శి వద్ద ఈ అంశం చర్చకు వచ్చింది.

  • తొలుత స్టోన్‌కాలమ్స్‌ నిర్మాణంలో ఆలస్యమయింది. మధ్యలో గోదావరికి భారీ వరద వచ్చింది. దాంతో స్టోన్‌ కాలమ్స్‌తో అంతకుముందు ఉన్న మట్టి నమూనాల రకాలకు, ఆ తర్వాత వరదల వల్ల మట్టిలక్షణాలు మారిపోయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అక్కడి మట్టిని మళ్లీ పరీక్షించి, అంతకుముందు చేసిన పరీక్షల ఫలితాలతో పోల్చిచూడాలని నిర్ణయించారు. ఈ పరీక్షల ఫలితాలు వస్తే దాని ఆధారంగా నివేదిక సమర్పించేందుకు వేచి చూస్తున్నారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని