CM Jagan: సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి

సీఎం జగన్‌ కాన్వాయ్‌పై పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైకాపా నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నంచేయగా బాధితుడి ద్వారా బయటకు వచ్చింది.

Updated : 28 Dec 2023 06:56 IST

నిందితుడు పులివెందుల నియోజకవర్గవాసి

ఈనాడు, కడప: సీఎం జగన్‌ కాన్వాయ్‌పై పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైకాపా నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నంచేయగా బాధితుడి ద్వారా బయటకు వచ్చింది. ఈ నెల 24న సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో  బయలుదేరారు. ఆ సమయంలో గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ వాహనంపై పడింది. గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు తీవ్రంగా కొట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు వైకాపా నేతలు జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పింఛను కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను రాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరినట్లు తెలిసింది. బుధవారం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని