‘సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి నా భర్తను బలిపశువును చేశారు’

సీఎం జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డి వారి స్వార్థం కోసం తన భర్తను బలిపశువును చేశారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 26 Jan 2024 07:50 IST

గతంలో రూ.5కోట్లు ఇస్తామని ఆశచూపి ముంచేశారు
చేయని తప్పునకు జైలుకు పంపారు
వివేకా హత్య కేసు అప్రూవర్‌ దస్తగిరి భార్య ఆవేదన 

పులివెందుల, న్యూస్‌టుడే: సీఎం జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డి వారి స్వార్థం కోసం తన భర్తను బలిపశువును చేశారని వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని తన నివాసంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకా హత్యలో మీ ప్రమేయం లేనప్పుడు నిర్దోషులుగా నిరూపించుకోవాలే తప్ప, తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తాము అల్పులమని, తమతో ఎందుకు యుద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్లు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని, గతంలో నా భర్త దస్తగిరికి రూ.5కోట్లు ఇస్తామని ఆశ చూపించి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు చేయని తప్పునకు జైలుకు పంపి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని వాపోయారు. సొంతవారినే హత్య చేసిన వారు మమ్మల్ని వదిలిపెడతారని అనుకోవడం లేదన్నారు. మాకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేశారు.

పోలీసులు, వైకాపా కార్యకర్తలు నా భర్తకు శత్రువులుగా మారారని, ఆయనకు ప్రాణహాని ఉందని కాపాడాలంటూ పలువురిని ప్రాధేయపడి బెయిల్‌ తెచ్చుకున్నా బయటకు రానివ్వడం లేదని వాపోయారు. పీటీ వారెంట్ వేశారని, దానిపై కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే నా భర్తను జైలు నుంచి బయటకు రానివ్వాలి, అలా రాకుండా చేస్తున్నారంటే మీరు తప్పు చేశారని ఒప్పుకొన్నట్లే కదా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే జైలులో ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారులు ఇటీవల నా భర్తను కారాగారంలో కలిసి ప్రలోభపెట్టారని ఆరోపించారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, అధికారి దీపక్‌గౌడ్‌, డీజీపీ సుహాసిని బలవంతంగా అప్రూవర్‌గా మార్చారని చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. వివేకా కుమార్తె సునీత తమకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు