ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం

ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Published : 09 May 2024 04:04 IST

విషపూరిత సరకుతో పొంచి ఉన్న పెనుముప్పు
అత్యంత హానికర రసాయనాలతో తయారీ
కల్తీ మద్యం పంచుతున్న ఓ ప్రధాన పార్టీ

ఈనాడు, అమరావతి: ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు, మూడు రోజులపాటు ఈ మద్యం తాగితే కీలక అవయవాలన్నీ దెబ్బతినటం ఖాయమని చెబుతున్నారు. దీని మత్తులో ఉంటే ఒక్కసారిగా శ్వాసక్రియ నిలిచి ఆకస్మికంగా రక్త ప్రసరణ ఆగిపోయే ముప్పుందని పేర్కొంటున్నారు. అయినప్పటికీ పెనుముప్పు ఎదుర్కొనేలోగా మాకు ఓటేయండి అనేలా పార్టీ నాయకులు కల్తీ మద్యాన్ని యథేచ్ఛగా పంచుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే అత్యంత ప్రమాదకరమైన మద్యాన్ని పోస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీ ఇదే తరహాలో కల్తీ మద్యాన్ని పంచుతూ పలువురి ప్రాణాలను బలిగొంది. ఇప్పుడూ మళ్లీ అదే విషపు చుక్కలను పంచుతోంది. ఈ మద్యం రెండు, మూడు క్వార్టర్లు తాగితే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే.

అర్థమయ్యేలోపే  అవయవాలపై తీవ్ర ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న జే బ్రాండ్లే ప్రమాదకరం కాగా.. ప్రధాన పార్టీ ఇప్పుడు గోవా బ్రాండ్ల పేరిట పంచుతున్న మద్యం మరింత హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ మద్యం తయారీలో ఆరితేరిన ముఠా ఆఫ్రికా దేశాల తరహాలో అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన కల్తీ మద్యాన్ని గోవాలోని డిస్టిలరీల్లో తయారు చేయిస్తోంది. ఆ సరకును సీసాల్లో నింపి అచ్చం అసలైనదేనని నమ్మించేలా నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లు అతికించి సీళ్లు వేయించింది. దాన్నే గోవా మద్యమంటూ ఓటర్లకు పంచుతోంది. ఇది తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

‘తాగితే ఒళ్లంతా సూదులతో గుచ్చినట్లుంటుంది. శ్వాసలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. కళ్లు ఎరుపెక్కుతాయి. జీర్ణం కాదు. శరీరం మెలికలు తిరుగుతుంది. ఒక్కోసారి మూర్చతో పడిపోతారు. అసలేమవుతుందో అర్థం చేసుకునేలోపే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది’ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయం, క్లోమ గ్రంథి (పాంక్రియాస్‌) దెబ్బతింటాయని చెబుతున్నారు.

2014లో పలువురి ప్రాణాలు బలిగొన్న పార్టీ

2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇదే తరహాలో కల్తీ మద్యం తయారుచేసి ఓటర్లకు పంచింది. అప్పట్లో అది తాగి 8 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వారిని ఆదుకునే దిక్కు లేదు. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కేసులున్నాయి. అప్పట్లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో కల్తీ మద్యం పంచిన ఆ పార్టీ.. ఈసారి రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా పంచుతోంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం, పోలీసులు మేల్కొని సరకు పంపిణీ అడ్డుకోకపోతే వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

తాళిబొట్లు తెంచేసే విషాన్ని మహిళలే అడ్డుకోవాలి

ఓట్ల కోసం ప్రలోభాలకు తెరలేపిన రాజకీయ పార్టీ గ్రామగ్రామానికీ భారీగా గోవా మద్యం పంపుతోంది. వ్యసనపరులందరికీ అందజేస్తోంది. రాబోయే 2, 3 రోజుల్లో దీన్ని మరింత పెంచనుంది. వీటిని ఎక్కడికక్కడ మహిళలే అడ్డుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ మద్యమే వారి తాళిబొట్లు తెంచే విషమవుతుంది.


గోవా మద్యం తాగాక.. ఊపిరాడక అల్లాడిపోయా

‘రెండు రోజుల పాటు ఓ ప్రధాన పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. గోవా బ్రాండ్ల పేరిట వారిచ్చిన మద్యం తాగాక 20 నిమిషాల్లో ఆయాసం వచ్చింది. ఊపిరాడక అల్లాడిపోయా. చచ్చిపోతానేమోనన్నంత భయమేసింది. వెంట ఉన్నవాళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది. లేకుంటే ఈపాటికే ప్రాణాలు పోయుండేవి’ అని నెల్లూరుకు చెందిన ఓ నడివయస్కుడు చెప్పారు. ఈ దెబ్బకు భయపడి అసలు ఆ పార్టీ ప్రచారంవైపే కన్నెత్తి చూడడం లేదని తెలిపారు.


ప్రాణాలు ఎవరో తోడేస్తున్నట్లు అయింది..

‘జగనన్న బ్రాండ్లు నాసిరకంగా ఉన్నాయి. అవి తాగితే ఆరోగ్యం పాడవుతోంది. ఇప్పుడు నాణ్యమైన మద్యం ఇస్తారేమోనని ఓ ప్రధాన పార్టీ ప్రచారంలో పాల్గొన్నా. గోవా బ్రాండ్ల పేరుతో వారిచ్చిన మద్యం తాగిన వెంటనే కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. కంటిచూపు మసకబారింది. తల తిరిగింది. పేగుల్లో తిప్పేసింది. ముఖమంతా నల్లగా అయింది. శరీరంపైనే నియంత్రణ కోల్పోయా. ఎవరో ప్రాణాలు బలవంతంగా తోడేస్తున్నట్లయింది’ అని కాకినాడకు చెందిన రోజు కూలీ చెప్పారు.


చావంటే ఏంటో కళ్ల ముందు కనిపించింది..

‘ఓ రాజకీయ పార్టీ వాళ్లు ఉచితంగా గోవా మద్యం పోస్తున్నారని తాగేశా. రెండు, మూడు క్వార్టర్లు వరుసగా తాగేసరికి శరీరం బొంగరంలా తిరిగింది. నోరంతా దాహంతో పిడచకట్టుకుపోయింది. వాంతులయ్యాయి. శరీరమంతా సూదులతో గుచ్చేసినట్లయింది. చావంటే ఏంటో కళ్ల ముందు కనిపించింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డా’ అని ప్రకాశం జిల్లాకు చెందిన కార్మికుడు తెలిపారు. ఇలాంటి బాధితులు కోకొల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని