China: ‘రియల్‌’ టైటానిక్‌.. రూ.28 లక్షల కోట్ల అప్పులున్న చైనా స్థిరాస్తి దిగ్గజం దివాలా..!

దాదాపు రూ.28 లక్షల కోట్ల అప్పులున్న చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ దేశంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభానికి ఇది నిదర్శనంగా నిలిచింది. తమ సంస్థ కోలుకోవడానికి ఇదే మార్గమని ఎవర్‌గ్రాండే చెబుతోంది.

Updated : 18 Aug 2023 13:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)లో అంతర్గతంగా ముదిరిపోయిన రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభం ఇక బయటపడే సమయం దగ్గరపడింది. దాదాపు రెండేళ్లుగా చైనా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. దేశంలోని రెండో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థను దివాలా నుంచి కాపాడలేకపోయింది. తాజాగా చైనాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Evergrande) మంగళవారం దివాలా పత్రాలను న్యూయార్క్‌లో రెగ్యులేటరీ వద్ద దాఖలు చేసింది. ఈ సంస్థ అప్పుల మొత్తం దాదాపు 340 బిలియన్‌ డాలర్లుగా అంచనా. అంటే చైనా జీడీపీలో 2.437 శాతానికి సమానం. దివాలా కేసు మరో దేశంతో సంబంధం ఉన్నప్పుడు అమెరికా కోర్టులు సమన్వయం చేసుకొనేలా చాప్టర్‌-15 దివాలా పిటిషన్‌ను ఫైల్‌ చేసింది. ఇది అమెరికా రుణదాతలు బయట దేశాల్లోని కోర్టులతో సమన్వయం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది. తాజాగా దివాలా పిటిషన్‌పై ఎవర్‌గ్రాండే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దివాలా పత్రాలపై ఎవర్‌గ్రాండే విదేశీ ప్రతినిధి హోదాలో జిమ్మీవాంగ్‌ సంతకం చేశారు.

కొండంత సంస్థ కుదేలు..

ఈ సంస్థ చైనాలో ఏకంగా 280 నగరాల్లో 1300 భారీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. దీంతోపాటు రియల్‌ ఎస్టేటేతర వ్యాపారాలు కూడా దీనికి ఉన్నాయి. దాదాపు 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. వారందరూ సంస్థకు డబ్బులు చెల్లించిన వారే. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, హెల్త్‌కేర్‌, థీమ్‌పార్క్‌లను నిర్వహిస్తోంది. 2021లో ఇది రుణాలు చెల్లించలేకపోయింది. ఈ ఏడాది జులైలో ఈ సంస్థ రెండేళ్లలో భారీ నష్టాలను చవిచూసినట్లు పేర్కొంది. ఈ కాలంలో దాదాపు 81 బిలియన్‌ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో ఖాళీగా ఉన్న 6 కోట్ల ఇళ్ల ధరలు తగ్గే ప్రమాదం ఉంది. చైనీయుల సంపదలో చాలా భాగం రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉంది.

‘మెర్సిడెస్‌ బెంజ్‌’పై మహిళల మోజు.. హైదరాబాద్‌లో 30 శాతం కొనుగోలుదార్లు వాళ్లే

ఈ ఏడాది మొదట్లో రుణ పునర్‌వ్యవస్థీకరణ కోసం యత్నిస్తున్నట్లు ఎవర్‌గ్రాండే పేర్కొంది. ఇది చైనాలోనే అతిపెద్ద రుణ పునర్‌వ్యవస్థీకరణ కానుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ సంస్థ బాండ్లు కొనుగోలు చేసినవారితో ఒప్పందాలు చేసుకొంది. కంపెనీ తిరిగి పుంజుకొనేందుకు వీలుగా విదేశీ అప్పుల ఒత్తిడిని ఇది తగ్గిస్తుందని నియంత్రణ సంస్థలకు ఇది తెలిపింది. వచ్చే మూడేళ్లలో కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని ఇది భావిస్తోంది. ఇందుకోసం అత్యధికంగా మరో 43 బిలియన్‌ డాలర్ల రుణం అవసరం. కొత్త నిధులు అందకపోతే.. తన ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను మూసివేయాల్సి రావచ్చని కంపెనీ చెబుతోంది. ఈ వారంలో దుబాయ్‌కు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీ 500 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఈవీ విభాగంలో 28 శాతం వాటా దక్కించుకొంది.

చైనాకు భారీ ఎదురు దెబ్బ..

చైనా జీడీపీలో రియల్‌ఎస్టేట్‌ రంగానికి దాదాపు 30 శాతం వాటా ఉంది. 2021లో ఎవర్‌గ్రాండే ఆర్థిక కష్టాలు ఆ దేశ స్థిరాస్తి రంగాన్ని కుదిపేశాయి. అక్కడి గృహ కొనుగోలుదారులు, ఫైనాన్షియల్‌ మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారానికి చైనా ప్రభుత్వ దుందుడుకు వైఖరే కారణంగా మారింది. స్థిరాస్తి రంగం రుణ సమీకరణపై ఒక్కసారిగా కఠిన నిభంధనలు విధించింది. దీంతో ఎవర్‌గ్రాండే వంటి దిగ్గజ సంస్థలకు నగదు లభించడం కష్టంగా మారిపోయింది. తొలుత ఎవర్‌గ్రాండే ఆర్థిక కష్టాలు బయటపడటంతో ఆ దేశ స్థిరాస్తి రంగ డొల్లతనం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత  కాసియా, ఫాంటాసియా, షిమావో సంస్థలు దివాలా ప్రకటించాయి. ఇటీవల ఆ దేశానికి చెందిన కంట్రీ గ్రాండ్‌ కూడా విదేశీ బాండ్ల టోకెన్‌ మొత్తాలు చెల్లించలేకపోయింది. దీంతో ఈ సంస్థ అప్పుల పునర్‌ వ్యవస్థీకరణకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కంపెనీని నష్టాల బారి నుంచి బయటపడేయటానికి ఛైర్మన్‌ యాంగ్‌ హుయాన్‌ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఈ సంస్థ రేటింగ్‌ను తగ్గించింది. నగదు కోసం కంట్రీగార్డెన్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

ఆర్థిక కష్టాల్లో చైనా..!

చైనాలో ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. కొవిడ్‌ అనంతరం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 3.7శాతం మాత్రమే నమోదై నిరాశపర్చింది. ఈ వృద్ధిరేటు జూన్‌లో 4.4శాతంగా ఉంది. ముఖ్యంగా జూన్‌లో రిటైల్‌ విక్రయాల వృద్ధి 2.5 శాతంగానే ఉంది. దీనికి తోడు అక్కడ ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడి ధరలు పడిపోతున్నాయి. అయినా విక్రయాలు ఉండటంలేదు. నిరుద్యోగ రేటు గత ఆరు నెలలుగా నిలకడగా పెరగడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి కారణమైంది. చైనాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగిందని వార్తలొచ్చాయి. ఇక 16-24 ఏళ్ల మధ్యలోని వారిలో నిరుద్యోగ రేటు గత ఆరు నెలలుగా నిలకడగా పెరుగుతోంది. ఒక్క జూన్‌లోనే 21.3 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ నిరుద్యోగుల డేటాను వెల్లడించకూడదని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని